బడ్జెట్ 2020 ఇంపాక్ట్: ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేనా?
కేంద్ర బడ్జెట్ 2020 ఆవిష్కృతమైంది. ఒక్కోరంగానికి ఏ మేరకు కేటాయింపులు చేశారు, వేటిపై పన్ను బాదారో ఎవరికి వారు పరిశీలించుకుంటూ బిజీగా ఉన్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్ డీ ఐ) ల పై నేరుగా ఎలాంటి ప్రకటన లేకున్నా... ప్రస్తుత బడ్జెట్ ప్రభావం దీనిపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఇండియాలో మౌలికసదుపాయాల రంగంపై రూ 103 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది అందరికీ నచ్చింది.
సహజంగానే... ఏ దేశంలోనైనా మౌలిక సదుపాయాల రంగంపై అధిక పెట్టుబడులు పెడితే... ఆ దేశంలో జీడీపీ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే, ఈ ప్రకటన ఇప్పుడే ఆర్థిక మంత్రి కొత్తగా చేసింది కాదు. ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ గత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్ర కోట పై నుంచి చేసిన ప్రసంగంలోనే చెప్పేశారు. మధ్య మధ్యలో కూడా అనేక సార్లు అదే విషయాన్ని ఉటంకించారు. దీంతో, ఈ రంగంలో ఉన్నవారు అందరికీ దానిపై ఒక అవగాహన వచ్చేసింది.
కానీ అందరి అనుమానం ఒక్కటే... అంత భారీ పెట్టుబడులు పెట్టేంత సొమ్ము ప్రభుత్వం వద్ద ఉందా అని. ఇప్పుడు కూడా ఒక వైపు పారిశ్రామికవేత్తలు బడ్జెట్ ను పొగుడుతున్నా... లోలోపల వారికి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పైకి గంభీరంగా రూ 103 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పినా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మౌలిక రంగ మూలధన నిధుల కేటాయింపు తగ్గించటం గమనార్హం. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఎఫ్ డీ ఐ లను ఆకర్షిస్తేనే దేశానికి మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విదేశి నిధులే దిక్కు...
ప్రభుత్వం చేతిలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులు లేవనేది జగమెరిగిన సత్యం. అందుకే, ప్రభుత్వం మౌలిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ సంస్థల వైపు చూస్తోంది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలి. ఇప్పటికే ఈ దిశగా కొంత పురోగతి కూడా కనిపించింది. ప్రస్తుత బడ్జెట్ కూడా సావరిన్ ఫండ్స్ కు పన్ను మినహాయింపులు కల్పించటం ఈ వ్యూహంలో భాగమే. మౌలిక సదుపాయాల రంగంలో అవి చేసే పెట్టుబడులపై 100% పన్ను మినహాయింపులను పొందవచ్చు. ఈ నిర్ణయం భారీ స్థాయిలో సావరిన్ ఫండ్స్ ఉన్న కెనడా, జపాన్, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలతో పాటు కొన్ని యూరోపియన్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ఆయా దేశాల్లో పెట్టుబడులపై రాబడులు 0.5% నుంచి 3% లోపే ఉంటున్నాయి. కానీ మన దేశంలో ఇప్పటికీ సగటున 10% రాబడికి హామీ ఉంది. అదే సమయంలో రాబడిపై పన్ను లేకుంటే... స్థూల లాభం మరింత అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ఫండ్స్ ఆసక్తి చూపుతాయి.
తయారీ లో పెట్టుబడులు...
తయారీ రంగంలో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్ డీ ఐ ) కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్లో 2019 అక్టోబర్ 1 తర్వాత చేసే తయారీ పరిశ్రమలకు కేవలం 15% కార్పొరేట్ టాక్స్ వర్తిస్తుంది. కాబట్టి ఇండియాను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో చైనా లో ఉత్పత్తి వ్యయాలు పెరగటం కూడా మన దేశానికి కలిసిరానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మనతో పోటీ లో మలేసియా, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఉన్నప్పటికీ... మానవ వనరుల లభ్యత, తక్కువ పన్నులు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలు కలిసి రానున్నాయి. విదేశీ కంపెనీలు నేరుగా ఫ్యాక్టరీ లు పెట్టి ఇటు భారత మార్కెట్ ను కూడా టాప్ చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
తగ్గిన కేటాయింపులు...
ఒక వైపు మౌలిక రంగానికి పెద్ద పీట వేశామని చెబుతున్న ప్రభుత్వం... బడ్జెట్ లో మాత్రం 202-21 ఆర్థిక సంవత్సరానికి ఈ రంగంలో మూలధన పెట్టుబడుల కేటాయింపులను తగ్గించటం గమనార్హం. గతేడాది రూ 5.1 లక్షల కోట్లు ఉండగా... ప్రస్తుతం అది రూ 4.7 లక్షల కోట్లకు తగ్గిపోయింది. మరో రూ 2.6 లక్షల కోట్ల మేరకు రాష్ట్రాల నుంచి ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. కానీ మరో 50% నికి పైగా నిధులను ప్రైవేట్ రంగమే భరించాల్సి ఉంటుంది. అటు బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. గత ఏడెనిమిది ఏళ్లుగా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం బాగా దెబ్బతింది. ఏవో కొన్ని కంపెనీలు మినహా చాలా వరకు ఇన్ఫ్రా కంపెనీలు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగం ఇందులో పెట్టుబడులు పెడుతుందనుకోవటం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే, అధిక మొత్తంలో ఎఫ్ డీ ఐ లను ఆకర్షించటమే మేలని వారు సూచిస్తున్నారు.