Budget 2020: బ్యాంకు డిపాజిటర్లందరికీ భారీ ఊరట, రూ.5 లక్షల వరకు బీమా
న్యూఢిల్లీ: బ్యాంకులలో డబ్బులు పొదుపు చేసే వారికి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో భారీ ఊరట కల్పించారు. బ్యాంకులలో దాచుకునే మొత్తానికి మరింత భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది మధ్య తరగతి ప్రజలకు శుభవార్తగా చెప్పారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీ ఇప్పటి వరకు రూ.1 లక్షగా ఉంది. దీనిని ఐదు రెట్లు పెంచుతూ సామాన్యులకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.
Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా
రూ.5 లక్షల వరకు ఇన్సురెన్స్
డిపాజిటర్ల ఇన్సురెన్స్ కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఏడాది పీఎంసీ బ్యాంకు స్కాం నేపథ్యంలో ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిని రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినిపించాయి. ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ఇది సామాన్యులకు ఊరట కలిగించే అంశం.
వారికి భారీ ఊరట
ఈ నిర్ణయం సహకార బ్యాంకులను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ సవరణలపై కసరత్తు చేస్తోందని తెలిపారు. ఆర్బీఐ స్తంభింప చేసిన బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్న వారికి ఇది పెద్ద శుభవార్త. ఇదివరకు రూ.1 లక్షగా ఉన్న దానిని రూ.5 లక్షలకు పెంచడం ఎంతో ఊరట కలిగించే అంశం.
కంగారు అవసరం లేదు
అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని, ప్రజలు ఈ విషయమై కంగారు పడవలసిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దీంతో పాటు ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీని స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు.
బీమా కవరేజీ
డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు విఫలమై, నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఆ బ్యాంకుల్లోని ఖాతాదారుల డిపాజిట్లపై బీమా కవరేజీ ఉంటుంది. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) ఈ బీమాను అందిస్తోంది.
వీటన్నింటికి వర్తింపు
ఖాతాదారుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండానే బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ట మొత్తం వరకు ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది. దీనిని ఇప్పుడు ఐదు రెట్లు పెంచి రూ.5 లక్షలుగా చేశారు. సేవింగ్స్, కరెంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లకు, రికరింగ్ డిపాజిట్లకు ఈ బీమా వర్తిస్తుంది.