బడ్జెట్ ఎఫెక్ట్, 200 లక్షల కోట్లు దాటిన ఇన్వెస్టర్ల సంపద: 4 రోజుల్లో రూ.14 లక్షల కోట్లు
ముంబై: బడ్జెట్ తర్వాత మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుండి మార్కెట్లు రోజు రోజు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. నిఫ్టీ 15,000 సమీపానికి చేరుకోగా, సెన్సెక్స్ 51,000 పాయింట్ల దిశగా దూసుకెళ్తోంది. నేడు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.200 లక్షల కోట్లను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటిసారి ఇన్వెస్టర్ల సంపద ఈ మైలురాయిని తాకింది. గత వారం చివరి సెషన్లో రూ.1.86 లక్షల కోట్లుగా ఉన్న ఎం-క్యాప్ ఇప్పుడు రూ.200 లక్షల కోట్లను దాటడం గమనార్హం. నాలుగు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.14 లక్షల కోట్ల వరకు ఎగిసింది.
జాక్మాను చైనా పక్కన పెట్టేసినట్లేనా? ఆ జాబితా నుండి ఔట్
మార్కెట్ అదుర్స్
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ నాలుగు రోజుల్లో 1250 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ బ్యాంకు 35000 పాయింట్లను దాటింది. నిఫ్టీ బ్యాంకు వరుసగా ఆరో రోజు లాభపడింది. నిఫ్టీ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా రెండో రోజు ఎగిశాయి. 10 డిసెంబర్ 2020 నుండి మొదటిసారి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ భారీగా లాభపడింది. ఇందులో పీ అండ్ జీ ఎగిసిపడింది. నేటి భారీ లాభాలకు ఐటీసీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అండగా ఉన్నాయి. సెన్సెక్స్ 30లోని 17 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ దాదాపు 5 శాతం నుండి 6 శాతానికి పైగా లాభపడ్డాయి.
రూ.200 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ రోజు నుండి మార్కెట్లు జంప్ చేస్తున్నాయి. నిన్నటి ముగింపున రూ.198.3 లక్షల కోట్లగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద నేటి రూ.2,00,47,191.31 లక్షల కోట్లకు పెరిగింది. సెన్సెక్స్ నాలుగు రోజుల్లో 4,300 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 50,400 పాయింట్లను దాటిన సమయంలో ఇన్వెస్టర్ల ఆదాయం రూ.200 కోట్లు దాటింది.
రిలయన్స్ టాప్ 1
టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ మార్కెట్ వ్యాల్యూ రూ.1219676.70 కోట్లుగా ఉంది. రూ.1195997.58 కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా HDFC బ్యాంకు (రూ.869433.32 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.545099.67 కోట్లు), హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (రూ.527957.04 కోట్లు), HDFC (రూ.487465.07 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (రూ.433287.38 కోట్లు), కొటక్ మహీంద్రా బ్యాంకు (రూ.378616.59 కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (రూ.331543.55 కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ.327524.39 కోట్లు)గా ఉంది.