సత్య నాదెళ్లా! మీది సాహసోపేత నిర్ణయం: ఆనంద్ మహీంద్రా ప్రశంస
ట్విట్టర్ ద్వారా వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లపై ప్రశంసలు కురిపించారు. అయితే సీఏఏ చట్టం లేదా హింసాత్మక ఘటనలపై స్పందించారనుకుంటే పొరపాటే. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆయన తన కంపెనీకి సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.
IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు
తమ సంస్థ స్థాపించినప్పటి నుంచి వెలువరించిన కార్బన్ ఉద్గారాలను 2050 నాటికి తొలగిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
గతంలో 2040 నాటికి తాము వెలువరించిన కర్భన ఉద్గారాలను తొలగిస్తామని మహేంద్ర సంస్థ ప్రతిజ్ఞ చేసిందని, పదేళ్ల తర్వాత ఇప్పుడు మీరు మీ సంస్థ కూడా వెలువరించిన ఉద్గారాలను తొలగిస్తామని చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. తనకు తెలిసి ఇది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు.
మైక్రోసాఫ్ట్ స్థాపించిన నాటి నుంచి వెలువరించిన కార్బన్ ఉద్గారాలను 2050 నాటికి తొలగిస్తామని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ను 1975లో స్థాపించారు. 45 ఏళ్ల నుంచి వెలువరించిన ఉద్గారాలను ఈ సంస్థ రానున్న మూడు దశాబ్దాల్లో తొలగించనుంది.
గణాంకాల ప్రకారం ప్రపంచం తీవ్రమైన కార్బన్ ఉద్గారాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీటిని వాతావరణం నుంచి తొలగించకుంటే ఉష్ణోగ్రతలు పెరిగి దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. కాగా మైక్రోసాఫ్ట్ 2012 నుంచి కార్బన్ ఉద్గారాల తొలగింపుకు చర్యలు తీసుకుంటుంది. గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు కూడా అదే బాటన నడుస్తున్నాయి.