నగరాల్లో గోబర్-ధన్ ప్లాంట్లు: రెండేళ్లల్లో 75 చోట్ల: మోడీ ప్రకటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75 నగరాల్లో బయో-సీఎన్జీ ప్లాంట్లను నెలకొల్పుతామని, ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. వచ్చే రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ 75 బయో-సీఎన్జీ ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. గోబర్-ధన్ ప్లాంట్లుగా వాటి స్థాపిస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిత్యం వెలువడే ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)గా మార్చడానికి అవి ఉపయోగపడతాయని అన్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్మించిన గోబర్-ధన్ ప్లాంట్ను మోడీ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసియాలోనే అతిపెద్ద బయో-సీఎన్జీ ప్లాంట్ ఇది. ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా వాటిని నిర్మిస్తామని అన్నారు. నగరాల్లో క్లీన్ ఎనర్జీ, కాలుష్య రహిత వాతావరణాన్ని సృష్టించడంలో భాగంగా ఇలాంటి ప్లాంట్లను విరివిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇండోర్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 150 కోట్ల రూపాయలను వ్యయం చేశాయి. 550 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ఈ ప్లాంట్లో ప్రాసెస్ చేయవచ్చు. 100 టన్నుల కంపోస్ట్ నుంచి 17,500 కేజీల బయోగ్యాస్ను ఇండోర్ ప్లాంట్ ఉత్పత్తి చేయగలుగుతుంది. 100 శాతం వ్యర్థాలతోనే ఈ ప్లాంట్ నడుస్తుంది. 96 శాతం మీథేన్ గ్యాస్తో సీఎన్జీ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రజారవాణాలో వినియోగించే వాహనాలకు 50 శాతం సీఎన్జీని సరఫరా చేస్తారు.
In line with the principles of 'waste to wealth' and 'circular economy', PM @narendramodi will inaugurate the Gobar-Dhan plant in Indore today at 1 PM.
— MyGovIndia (@mygovindia) February 19, 2022
Watch the event live at: https://t.co/WnOQsNk4Js #GobarDhanInMP pic.twitter.com/l9WUGUNWPc
మిగిలిన 50 శాతాన్ని పరిశ్రమలకు కేటాయిస్తారు. ప్రజారవాణాలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 400 బస్సులకు ఈ బయో-సీఎన్జీ ప్లాంట్ నుంచి బయో గ్యాస్ను సరఫరా అవుతుంది. ఇలాంటి ప్లాంట్లను దేశవ్యాప్తంగా నిర్మించుకోవడం ద్వారా ఘన వ్యర్థాలను వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే ఇండోర్ తరహా ప్లాంట్లు.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసి 75 నగరాల్లో ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకుంటోంది.