Elon Musk: జియో, ఎయిర్ టెల్ లకు ఎలాన్ మస్క్ షాక్.. భారత ప్రభుత్వంతో చర్చలు.. ఇక చుక్కలేనా
Starlink: వ్యాపార ప్రపంచంలో ఎలాన్ మస్క్ ప్రత్యేకతే వేరు. ఏదో ఒక ప్రకటనతో వ్యాపారాలను ఎప్పుడూ నాశనం చేస్తూనే ఉంటారు. ఒక సారి కొంటానంటాడు.. మరో సారి అలాంటి వ్యాపారాన్ని తానే సృష్టిస్తానని బెదిరిస్తుంటాడు. ఇలా ఆయన దందానే వేరు. అందుకే ప్రపంచ కుబేరుల జాబితాలో మెుదటి స్థానలో ఉన్నాడు.
ఇండియాపై కన్ను..
ఈ ప్రపంచ కుబేరుడి కన్ను ప్రస్తుతం భారత్ పై పడింది. అవును ఎలాన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ఎక్స్ తన స్టార్లింక్ బ్రాండ్తో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు అనుమతిని కోరుతోంది. అలా మస్క్ కంపెనీ దేశంలో ఈ సేవలను అందించేందుకు దరఖాస్తు చేసుకున్న మూడవ కంపెనీగా అవతరించింది.
అనుమతి కోసం..
ల్యాండింగ్ హక్కులు, మార్కెట్ యాక్సెస్ కోసం స్పేస్ఎక్స్ భారత ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన అనుమతులను కూడా కోరుతుంది. స్థానిక గేట్వేలను ఏర్పాటు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) నుంచి అనుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై స్పష్టత కోసం రాయిటర్స్ వార్తా సంస్థ ఇరు వర్గాలను కోరినప్పటికీ వారు స్పందించలేదు .
తిరిగి చెల్లించాలని..
స్టార్లింక్ని దేశంలో ఆపరేట్ చేయడానికి లైసెన్స్లను పొందే వరకు దాని ప్రీ-ఆర్డర్లన్నింటిని తిరిగి చెల్లించమని ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో.. SpaceX భారతీయ అధికారులకు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (GMPCS) సేవల లైసెన్స్ కోసం "అతి త్వరలో" దరఖాస్తు చేసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగంలో భారతీ గ్రూప్ సంస్థ వన్వెబ్, రిలయన్స్ జియో ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కోరుతూ దరఖాస్తు చేస్కున్నాయి.