హైదరాబాద్లో ఎయిర్టెల్ 5G సేవలు సక్సెస్, సొంత టెక్నాలజీతో జియో త్వరలో..
న్యూఢిల్లీ: భారత్లో 5G టెలికం సేవల్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు భారతీ ఎయిర్టెల్ సిద్ధమవుతోంది. కమర్షియల్ ప్రారంభానికి ముందు హైదరాబాద్లో వాణిజ్య నెట్వర్క్ ద్వారా 5G సేవల్ని విజయవంతంగా ప్రదర్శించినట్లు ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో వాణిజ్య నెట్వర్క్ ద్వారా 5G సర్వీసుల్ని ప్రదర్శించిన తొలి టెలికం సంస్థగా ఎయిర్టెల్ ఆవిర్భవించినట్లు తెలిపింది. ప్రస్తుతం 1,800 మెగాహెర్ట్ బ్యాండ్లోని సరళీకృత స్పెక్ట్రంను ఉపయోగించి నాన్ స్టాండలోన నెట్వర్క్ టెక్నాలజీతో 5G సేవల్ని పరీక్షించినట్లు తెలిపింది.
ఆ తర్వాతే అందుబాటులోకి
5G, 4G నెట్వర్క్స్ను ఏకకాలంలో నిరంతరాయంగా ఆపరేట్ చేసేందుకు తొలిసారి డైనమిక్ స్పెక్ట్రం షేరింగ్ను ఉపయోగించినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. ఈ పరీక్షల కోసం ఎరిక్సన్ 4G రేడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఒప్పో రెనో 5ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్స్ వినియోగించినట్లు తెలిపింది. 5G సేవలకు ఎయిర్టెల్ నెట్ వర్క్లోని రేడియో, కోర్, ట్రాన్సుపోర్ట్ విభాగాలు సన్నద్దంగా ఉన్నట్లు పరీక్షల్లో తెలిపింది. అయితే తగినంత స్పెక్ట్రంతో పాటు ప్రభుత్వం నుండి అనుమతుల అనంతరం సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
కీలక పరికరాలు దేశీయంగా
హైదరాబాద్లో నిర్వహించిన పరీక్ష ద్వారా దేశంలో ప్రయోగాత్మకంగా 5G సేవల్ని అందించిన తొలి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. శాంసంగ్ టెక్నాలజీ ద్వారా పరీక్షలు చేసినట్లుగా తెలుస్తోంది. జియో కూడా ఇందుకు సిద్ధమవుతోంది. ఇందుకు జియో సొంత 5G టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 5G నెట్ వర్క్లో ఉపయోగించే కీలక పరికరాలు దేశీయంగా తయారై ఉండాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
వెనుకపడవద్దు
4G సేవల కంటే పది రెట్ల వేగంతో, పదింతల సామర్థ్యంతో 5G సేవలు అందించవచ్చునని చెబుతున్నారు. గతంలో 2G, 3G, 4G సేవల్లో వెనుకబడినప్పటికీ 5Gలో అలా జరగకూడదని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా త్వరలో అనుమతుల మంజూరుకు సిద్ధమవుతోంది.