డిసెంబర్ 12న మార్కెట్లోకి భారత్ బాండ్ ఇష్యూ, కనీస పెట్టుబడి రూ.1,000
ప్రభుత్వం తొలిసారిగా తీసుకువస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్ డిసెంబర్ 12వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ బాండ్ ద్వారా నిధులు సేకరిస్తాయి. భారత్ బాండ్స్ను 12వ తేదీన విడుదల చేసేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి న్యూఫండ్ ఆఫర్ డిసెంబర్ 12న ప్రారంభమై 20వ తేదీన ముగియనుంది. ఈ ఆఫర్ వ్యాల్యూ రూ.7,000 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. కేంద్ర కేబినెట్ ఈ నెల 4వ తేదీన ఈ బాండ్స్ను తీసుకు వచ్చేందుకు ఆమోదం తెలిపింది.
ఈ SBI కార్డు బ్లాక్ చేస్తారు, కొత్త EVM కార్డు కోసం ఇలా అప్లై చేయండి
కేంద్ర, రాష్ట్ర రంగ ప్రభుత్వ సంస్థలు జారీ చేసే బాండ్లతో ఓ సూచీ రూపొందించి ఎక్స్చేంజీలో ట్రేడింగ్కు వీలు కల్పించడమే భారత్ బాండ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ తొలి విడత ఇష్యూ బుధవారం, 12 డిసెంబర్, 2019న వస్తోంది. కనీస పెట్టుబడి రూ.1,000గా ఉంటుంది. బాండ్ల రేటింగ్ AAAతో మూడేళ్లు, పదేళ్ల కాలపరిమితి ఉన్న బాండ్స్ మాత్రమే ఈటీఎఫ్లలో ఉండనున్నాయి.
ఇప్పటి వరకు ఈక్విటీ ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు డెట్ ఎక్స్చేంజీ ట్రెడండ్ ఫండ్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. భారత్ బాండ్ పేరుతో జారీ చేస్తున్నారు. బాండ్స్లో పెట్టుబడికి ఇప్పటి వరకు చిన్న మదుపర్లు దూరంగా ఉన్నారు. వారిని బాండ్స్ వైపు చేరువ చేసేందుకు ఇవి తోడ్పడనున్నాయి. కనీస పెట్టుబడి రూ.1000 కావడంతో బాండ్స్ రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా.
NHAI, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, ఎగ్జిమ్ బ్యాంకు, నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వంటి కొన్ని PSUలు జారీ చేసిన బాండ్స్ ప్రతిపాదిత ఈటీఎఫ్లలో ఉండవచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ దేశంలో మొట్టమొదటి కార్పోరేట్ బాండ్ ఈటీఎఫ్ కానుంది. ప్రస్తుతం ఉన్న ఈక్విటీ ఈటీఎఫ్లకు తోడు బాండ్స్ మార్కెట్ను విస్తృతం చేసేందుకు బాండ్స్ ఈటీఎఫ్ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.