Bharat Bandh: బ్యాంకులు, ట్రాన్స్పోర్ట్పై ప్రభావం, ఎవరేమన్నారు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావంగా మంగళవారం భారత్ బంద్కు పిలుపునివ్వగా, పలు పార్టీలు, పలు వర్గాలు మద్దతు ఇచ్చాయి. ఉదయం గం.8 నుండి మధ్యాహ్నం గం.3 వరకు బంద్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్, టీఆర్ఎస్ సహా 25 పార్టీలు మద్దతిచ్చాయి.
అదే సమయంలో పంజాబ్ మినహా ఎక్కడా భారత్ బంద్ను రైతులు పట్టించుకోవడం లేదని, రైతులకు మేలు చేసే చట్టాలు తెస్తే వ్యతిరేకిస్తున్నారని అధికార బీజేపీ పార్టీ చెబుతోంది. పార్టీల మాటలు ఏమైనా నేడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు, వాహనాలపై ప్రభావం ఎలా ఉంటుందో చూడండి.
బ్యాంకు యూనియన్ల మాటేమిటి?
ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సౌమ్యదత్తా మాట్లాడుతూ... రైతులకు సంఘీభావం తెలుపుతున్నామని, అయితే భారత్ బంద్లో పాల్గొనడడం లేదని తెలిపారు. ఈ బందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము కూడా భారత్ బంద్లో పాల్గొనడం లేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. పనివేళల్లో యూనియన్ మెంబర్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతారన్నారు. అయితే కొందరు బ్యాంకు ఉద్యోగులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
ట్రాన్సుపోర్ట్
భారత్ బంద్ వల్ల రోడ్లు బ్లాక్ చేస్తారు. కాబట్టి రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆటో, ట్యాక్సీ సంఘాలు కూడా ఈ బందుకు మద్దతు తెలిపాయి. అయితే ఢిల్లీ ఆటో రిక్షా సంఘ్, ఢిల్లీ ప్రదేశ్ ట్యాక్సీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజేంద్రసోని మాట్లాడుతూ.. చాలా సంఘాలు బందులో పాల్గొనడంలేదన్నారు. ఏదైనా రవాణాకు ఇబ్బందులు కలగవచ్చు. బస్సులు కూడా బయటకు వచ్చే పరిస్థితులు తక్కువ. జేఎన్టీయూ సెమిస్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా పడింది. దేశమంతా వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్సుపోర్ట్ కాంగ్రెస్ ప్రకటించింది.
మేం దూరం..
పలు ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాల నుండి పెద్ద దుకాణాల వరకు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాలు, కూరగాయల సరఫరా దెబ్బతిన వచ్చు. అయితే ఎమర్జెన్సీ సర్వీసులు, పెళ్లి వంటి వాటికి మినహాయింపు ఉండనుంది. కాగా, ఈ బందులో పాల్గొనడం లేదని భారతీయ కిసాన్ సంఘ్ తెలిపింది. బీకేఎస్, ఇతర సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేసిన తర్వాతనే కేంద్రం ఈ చట్టాలు తెచ్చిందని, రైతు సంఘాలు కూడా తమను సంప్రదించి బందులో పాల్గొనవద్దని సూచించాయని భారతీయ కిసాన్ సంఘ్ తెలిపింది. రైతు సంఘాలు తమను సంప్రదించాయని అందుకే బందులో పాల్గొనడం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, ఆల్ ఇండియా ట్రాన్సుపోర్ట్ అసోసియేషన్లు తెలిపాయి.