ఉద్యోగులకు జెఫ్ బెజోస్ థ్యాంక్స్, సోషల్ మీడియాలో సెటైర్లు
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన ఉద్యోగులకు, తన కంపెనీకి థ్యాంక్స్ చెప్పారు. తన స్పేస్ ట్రిప్కు పేచేసినందుకు గాను ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెజాన్ సీఈవో మంగళవారం 11 నిమిషాల స్పేస్ రైడ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. తన బ్లూఆరిజిన్ కంపెనీ తయారు చేసిన రాకెట్ ద్వారా ఈ స్పేస్ రైడ్ చేశారు. అనంతరం ఆయన స్పందించారు. హిస్టారిక్ స్పేస్ ఫ్లైట్ అనంతరం జెఫ్ బెజోస్ బ్లూ స్పేస్ సూట్, కౌ-బాయ్ హ్యాట్ను ధరించి మీడియా సమావేశానికి హాజరయ్యారు.
బెజోస్ థ్యాంక్స్
నేను ప్రతి అమెజాన్ ఉద్యోగికి, అలాగే, ప్రతి అమెజాన్ కస్టమర్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని, ఎందుకంటే ఈ స్పేస్ ట్రిప్కు మీరే చెల్లించారని అన్నారు. అందుకే ప్రతి ఉద్యోగికి, ప్రతి కస్టమర్కు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
ఇది చాలా ప్రంశంసనీయమైనదన్నారు. జెఫ్ బెజోస్ కామెంట్స్ పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అమెజాన్ ఉద్యోగులు నిత్యం ఫిర్యాదు చేసే ఇబ్బందికర పని వాతావరణం, మీల్స్ తినకుండా, బాత్రూం బ్రేక్స్ కూడా సమయం లేని పని ఒత్తిడి వంటి అంశాలను గుర్తు చేస్తున్నారు.
నెటిజన్ల చురకలు
తక్కువ వేతనం కోసం పని చేయడం, డెలివరీ బాయ్స్కు కనీసం కరోనా వంటి సమయంలో హెల్త్ ఇన్సురెన్స్ లేకపోవడం వంటి అంశాల ద్వారా బెజోస్ చెప్పినట్లు ఈ ఖర్చును ఉద్యోగులే భరించారని ఓ నెటిజన్ చురక అంటించారు.
మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ కష్టపడుతూ పని చేస్తోన్న ఎంతోమంది అమెరికన్లు నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి థ్యాంక్స్ చెప్పడం జెఫ్ బెజోస్ మరిచిపోయారని, అమెజాన్ మాత్రం పన్ను చెల్లించలేదని ఎద్దేవా చేశారు.
జెఫ్ బెజోస్ స్పేస్ ఫ్లైట్ 11 నిమిషాల పాటు ప్రయాణించిందని, కానీ కరోనా సమయంలో ఆయన ప్రతి 11 నిమిషాలకు 1.6 మిలియన్ డాలర్ల సంపద పెంచుకున్నారని మరో నెటిజన్ పేర్కొన్నారు.
వీరికి అవార్డు
ఇదిలా ఉండగా, రోదసీయాత్ర పూర్తి చేసిన జెఫ్ బెజోస్ మరో కీలక ప్రకటన చేశారు. తన సొంత కంపెనీ బ్లూఆరిజిన్ రూపొందించి న్యూషెపర్డ్ వ్యోమనౌకలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరేజ్ అండ్ సివిలిటీ అవార్డును ప్రకటించారు. తొలి అవార్డును ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్, సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 746.02 కోట్లు) ఇవ్వనున్నారు. సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.