ఈ కాల్లో మీరు ఉంటే దురదృష్టవంతులు, జూమ్ కాల్లో 900 మంది ఉద్యోగాలు పోయాయి
గత ఏడాది కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు పోయాయి. చాలా కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. పలు కంపెనీలు మీటింగ్ సమయంలోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సందర్భాలు చూశాం. కొన్ని కంపెనీలు మాత్రమే నోటీస్ పీరియడ్ ఇచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఆర్థిక రికవరీ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రమంగా నియామకాలు పెరుగుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఇలాంటి సమయంలో అమెరికాలో ఓ కంపెనీ అధినేత ఏకంగా జూమ్ మీటింగ్లోనే వందలాది మంది ఉద్యోగులను తొలగించడం వార్తాంశంగా మారింది.
3 నిమిషాల్లోనే... 900 మంది
అమెరికాలోని న్యూయార్క్కు చెందిన హోమ్-ఓనర్షిప్ సంస్థ కేవలం మూడు నిమిషాల జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపుకు ముందు పాటించవలసిన నియమ నిబంధనలు కూడా పాటించలేదట. అసలు జూమ్ కాల్కు హాజరైన ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు అదే చివరి రోజు అనే విషయం కూడా అప్పటి వరకు తెలియదు. దీంతో పింక్ స్లిప్ అంతుకున్న ఓ ఉద్యోగి ఆ షార్ట్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
3 నిమిషాల్లోనే జరిగింది
న్యూయార్క్లో హోమ్-ఓనర్షిప్ కంపెనీ బెట్టర్ డాట్ కామ్. దీని సీఈవో భారత సంతతి వ్యక్తి విశాల్ గార్గ్. అతను జూమ్ మీటింగ్లో కంపెనీలోని 900 మంది ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఉద్యోగుల్లో ఇది 9 శాతం. ఉద్యోగులను తొలగించడానికి మార్కెట్ సామర్థ్యం, పర్ఫార్మెన్స్, ప్రోడక్టివిటీ వంటి అంశాలను కారణంగా చూపించారు.
జూమ్ మీటింగ్ను అతను ప్రారంభిస్తూ, తాను మీకు సంతోషకరమైన వార్తను ఇవ్వడం లేదని, మార్కెట్ మార్పులకు అనుగుణంగా కంపెనీ కూడా మారుతోందని ఉద్యోగులకు పింక్ స్లిప్ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత తొలగింపు గురించి వెల్లడించారు. పని తీరు బాగాలేదని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పనితీరు బాగా లేదని, మార్కెట్లో ఆశించినస్థాయిలో కష్టపడటం లేదని, నిర్దేశించిన వ్యాపారం చేయలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తక్షణమే మిమ్మల్ని ఉద్యోగంనుండి తీసివేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా మూడు నిమిషాల్లో జరిగింది
ఉద్యోగుల తొలగింపు ప్రకటన
'మీటింగ్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. నేను మీకు గొప్ప న్యూస్ను ఏమీ తీసుకురాలేదు. మార్కెట్ అంతా మారిపోయిందని మీకు తెలుసు. మారిన మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అనుగుణంగా కంపెనీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కంపెనీ 15 శాతం ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందుకు మార్కెట్, సామర్థ్యం, పనితీరు, ప్రోడక్టివిటీ వంటి వివిధ కారణాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు.
అయితే బెట్టర్ డాట్ కామ్ బాస్ ఆ తర్వాత 15 శాతం ఉద్యోగుల నుండి 9 శాతానికి సవరించుకున్నారు. ఈ కాల్(తొలగింపు)లో మీరు ఉన్నట్లయితే దురదృష్టవంతులు అని, మీ ఉద్యోగం పోయింది, ఈ మేరకు హెచ్ఆర్ నుండి మెయిల్ వస్తుందన్నారు. మిమ్మల్ని ఇప్పటికిప్పుడే తొలగిస్తున్నామని తెలిపారు. తొలగించిన ఈ ఉద్యోగులకు నెల రోజుల బెనిఫిట్స్, 2 నెలల కవరప్ అందిస్తున్నట్లు తెలిపింది. గార్గ్ బెట్టర్ డాట్ కామ్ సంస్థను 2016లో ప్రారంభించారు.
మళ్లీ ఇలాంటి పరిస్థితి రావొద్దు
పింక్ స్లిప్ అందుకున్న ఓ ఉద్యోగి గార్గ్ జూమ్ వీడియోకు సంబంధించిన ఓ షార్ట్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. తన కెరీర్లో ఇది రెండోసారి అని, మళ్లీ ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నానని, వాస్తవానికి మొదటిసారి తాను ఏడ్చానని, ఈసారి మాత్రం ధైర్యంగా ఉన్నానని సదరు ఉద్యోగి అన్నారు.