మూత్రంతో బీర్: టేస్ట్ అద్దిరిపోయిందట: కూల్కూల్గా యూరిన్ బీర్: ఆ కంపెనీ కొత్త ప్రయోగం
సింగపూర్: సింగపూర్ తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. చల్లచల్లగా గొంతులోకి దిగే బీర్ను మూత్రంతో తయారు చేసే ప్రయోగం అది. మూత్రాన్ని బీర్గా మార్చడంలో సక్సెస్ అయింది కూడా. సాక్షాత్తూ అక్కడి ప్రభుత్వమే దీన్ని తయారు చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని పర్యావరణహిత బీర్గా చెబుతోంది సింగపూర్ ప్రభుత్వం. కమర్షియల్ సేల్స్ను కూడా మొదలు పెట్టింది. పబ్స్, బార్లలో ఈ బీర్ అందుబాటులో ఉంది.
సింగపూర్ నేషనల్ వాటర్ ఏజెన్సీ దీన్ని తయారుచేస్తోంది. సస్టెయినబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో నడిచే సంస్థ ఇది. నీటి కొరతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆ సమస్యను అధిగమించడానికి ఈ ప్రయోగానికి తెర తీశామని నేషనల్ వాటర్ ఏజెన్సీ చెబుతోంది. మూత్రంతో పాటు జర్మన్ బార్లీ మాల్ట్స్, అరోమాటిక్ సిట్రా, కాలిప్సో హోప్స్, క్వీక్, నార్వే నుంచి సేకరించిన ఫామ్ హౌస్ ఈస్ట్ను మిక్స్ చేసి బీరు తయారు చేస్తోంది.
ఈ మిక్సింగ్లో అత్యంత కీలకమైనది న్యూవాటర్. మురికినీటిని శుద్ధి చేయడం ద్వారా న్యూవాటర్ తయారవుతుంది. మూత్రంతో పాటు మురికినీటిని శుద్ధి చేసిన తరువాత దాన్ని బీర్ తయారీ కోసం వినియోగిస్తుంది. ఈ బీర్ను తయారు చేయడానికి 95 శాతం వరకు ఈ న్యూవాటర్ను వాడుతుంది. దీనికి న్యూబ్రీవ్ అని పేరు పెట్టింది. ఇందులో కొంత మోతాదు వరకు సముద్రపు నీటిని కూడా వినియోగిస్తామని సింగపూర్ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు సభ్యుడు ర్యాన్ యూన్ తెలిపారు.
ఈ బీర్కు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రొడక్షన్కు మరింత పెంచుతామని అన్నారు. సంప్రదాయేతర వనరులపై ఆధారపడటంలో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వ్యాఖ్యానించారు. 2060 నాటికి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొవాల్సి వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. బీర్ తయారీలో సాధారణ నీటికి బదులుగా మూత్రం, మురికినీరు, సముద్రపు నీటిని వినియోగించడం వల్ల ఆ ఇబ్బందిని అధిగమించినట్టవుతుందని పేర్కొన్నారు.
కిందటి నెల 8వ తేదీన తొలిసారిగా న్యూబ్రీవ్ను లాంచ్ చేసింది సింగపూర్ ప్రభుత్వం. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ నెలన్నర రోజుల్లో 50 శాతానికి పైగా బీర్స్ అమ్ముడయ్యాయని సింగపూర్ మీడియా పేర్కొంది. ప్రారంభంలో దీని అమ్మకాలు మందకొడిగా ఉన్నప్పటికీ.. టేస్ట్ బాగుండటంతో సేల్స్ పెరుగుతూ వస్తుననాయని ర్యాన్ యూన్ చెప్పారు.