కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ కొనసాగితే రూ.2,83,533 కోట్ల నష్టం
దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉండవచ్చునని ఇదివరకు అంచనా వేసిన బార్క్లేస్ తాజాగా దీనిని 10 శాతానికి తగ్గించింది.
రూ.2,83,533 కోట్ల నష్టం
కరోనా సెకెండ్ వేవ్లో ఎంతమంది కరోనా బారిన్పడ్డారు? ఎంత మంది చనిపోయారు? అన్న దానిపై అనిశ్చితి నెలకొన్నందున జీడీపీ వృద్ధి రేటును కుదిస్తున్నట్లు తెలిపింది. కరోనా కట్టడికి ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా విధించిన లాక్డౌన్లు జూన్ చివరి వరకు కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు 38.4 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని బార్క్లేస్ పేర్కొంది. ఇది మన కరెన్సీలో రూ.2,83,533 కోట్లు.
భారత వృద్ధి రేటు
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఆంక్షలు ఆగస్ట్ వరకు కొనసాగితే భారత వృద్ధి రేటు 8.8 శాతానికి పడిపోతుందని కూడా బార్క్లేస్ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు మైనస్ 7.6 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. గత ఏడాది కోవిడ్ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. డిమాండ్ క్షీణించింది.
పెరుగుతున్న కేసులు
భారత దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు నాలుగు లక్షల కొత్త కేసులు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న సరఫరా సవాళ్లు, రవాణా సవాళ్ల ప్రభావం పడుతుందని తెలిపింది. మరో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సెకండ్ వేవ్ రూరల్ ఇండియాకు వెళ్లిందని, పట్టణంలో క్రమంగా తగ్గుతోందని పేర్కొంది.