వ్యాక్సీన్ వచ్చాకే.. టైం పట్టకపోవచ్చు, పెద్దరుణాల పట్ల అప్రమత్తం: సీఈఏ సుబ్రమణియన్
కరోనా మహమ్మారికి సంబంధించిన వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చాక మరిన్ని ఆర్థిక ఉద్దీపనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేఅవకాశం ఉందని చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ బుధవారం అన్నారు. వ్యాక్సీన్ వస్తే కరోనా వైరస్ వ్యాప్తి గురించిన అనిశ్చితులు తొలగిపోతాయన, అప్పుడు వినియోగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
పెరుగుతున్న కరోనా... తెలుగు రాష్ట్రాలు సహా ఇవే కీలకం, భారత ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ
వ్యాక్సీన్ రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు
ఉద్దీపనలు ప్రకటించడంతో పాటు వాటిని ఏ సమయంలో ఎప్పుడు ప్రకటించాలనేది కూడా చాలా ముఖ్యమనేది తన అభిప్రాయం అని సీఈఏ సుబ్రమణియన్ అన్నారు. కరోనా పరిణామాలపై అనిశ్చితి తొలిగే సమయం కోసం మనం వేచి చూడాల్సి ఉందన్నారు. ఆ తర్వాత చర్యలు చేపడితే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చునని వ్యాఖ్యానించారు. మరో రెండు మూడు నెలల్లో వ్యాక్సీన్ వస్తుందనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
పెట్టుబడులు, వృద్ధిపై ప్రభావం
భారత బ్యాంకింగ్ సెక్టార్ ఇబ్బందులు పెట్టుబడులు, వృద్ధిని ప్రభావితం చేశాయని సుబ్రమణియన్ అన్నారు. ఆయన ఫిక్కీ 17వ యాన్యువల్ కేపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్ (CAPAM2020)లో మాట్లాడారు. ఎన్పీఏలు, రిస్క్ ఇబ్బందులు పెట్టుబడులను ప్రభావితం చేశాయన్నారు. పెద్ద బ్యాంకులపరంగా భారత్ చాలా వెనుకబడి ఉందన్నారు. టాప్ 100లో చైనా బ్యాంకులు 18 ఉంటే, మన బ్యాంకు ఒకటి మాత్రమే ఉందన్నారు. అమెరికా నుండి 12 బ్యాంకులు ఉండగా, మనకంటే పరిమాణంలో చిన్నవైన స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్ దేశాలు మంచి స్థితిలో ఉన్నాయన్నారు.
పెద్ద రుణాల పట్ల అప్రమత్తం
పెద్దమొత్తంలో రుణాలు తీసుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణాలు ఇచ్చేముందు బ్యాంకులు తొలుత వారి ఫైనాన్షియల్ స్టేటస్ను చూడాలని సూచించారు. ఎంఎస్ఎంఈలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం కింద ఇచ్చిన రుణాలు పక్కన పెడితే ఇచ్చిన రుణాలు పెద్దగా లేవని చెప్పారు. బ్యాంకింగ్ రంగ ప్రస్తుత పరిస్థితితో భారత్ను అతిపెద్ద ఎకానమీగా మార్చలేమని అభిప్రాయపడ్డారు.
వినియోగంపై ప్రభావం
ప్రస్తుత మందగమనంలో ఎక్కువ పాత్ర బ్యాంకింగ్ రంగంలోని సమస్యల వల్లేనని అభిప్రాయపడ్డారు. ఎన్పీఏలు, కార్పోరేట్ రుణాలలో క్షీణత పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం చూపాయన్నారు. ఇవి తగ్గితే అందుకు అనుగుణంగా వినియోగం తగ్గుతుందన్నారు. అప్పుడు ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్స్కు దారి తీస్తోందన్నారు. పెద్ద బ్యాంకుల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అవుతుందన్నారు. భారత కంపెనీలు పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు.