మాల్యా సెటిల్మెంట్ మాకొద్దు, దివాలాకోరుగా ప్రకటించాలి: లండన్ హైకోర్టులో బ్యాంకులు
తమకు వేలకోట్ల రూపాయలు మోసగించి, బ్రిటన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను దివాలాకోరుగా (Bankruptcy) ప్రకటించాల్సిందేనని భారత్ బ్యాంకులు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు మరోసారి ఇంగ్లాండ్ హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్టియం వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనల అనంతరం జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్లో ఉంచారు.
అమెరికా నుండి భారత్ వరకు అంతే: పెను సంక్షోభం.. ఆర్బీఐ వద్దకు మళ్లీ మోడీ ప్రభుత్వం
సెటిల్మెంట్ కాదు.. దివాలాచర్యలు
మాల్యాపై తాము దివాలా ఆదేశాలు జారీ చేశామని, చెల్లింపుకు సంబంధించి సెటిల్మెంట్ కోసం ఆయన ముందుకు వచ్చిన ప్రయోజనం లేదని ఇండియన్ బ్యాంకులు హైకోర్టుకు తెలిపాయి. మాల్యా పేర్కొన్నట్లు తాము సెక్యూర్డ్ క్రెడిటర్లు కాదని తెలిపాయి. రెండో సెటిల్మెంట్ ఆఫర్ కింద యునైటెడ్ బ్రీవరీస్ హోల్డింగ్స్ ఆస్తులను మాల్యా చూపారని, కానీ అవి అధికారిక లిక్విడేటర్ ఆధీనంలో ఉన్నాయని బ్యాంకులు వెల్లడించాయి. కాబట్టి మాల్యా ఆఫర్కు విలువ లేదని తేల్చి చెప్పాయి.
రాజకీయ కారణాలు.. వట్టివే
రాజకీయ కారణాలతో తనకు ఇండియాలో న్యాయం జరగదనే మాల్యా వాదనలు సరికాదని, వాటిని పక్కన పెట్టాలని బ్యాంకుల కన్సార్టియం కోరింది. మంగళవారం మాల్యా రుణాలు సెక్యూర్డా కాదా అనే అంశంపై న్యాయమూర్తి బ్రిగ్స్ వాదనలు విన్నారు. కాగా, తనను భారత్కు అప్పగించకుండా మాల్యా వివిధ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవి ఒక్కటొక్కటు మూసుకుపోతున్నాయి. ఇంగ్లాండ్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును మే నెలలో తిరస్కరించారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ నిర్ణయం తేలాలి.
పిటిషన్ కొట్టివేత
విజయ్ మాల్యా ఇండియన్ బ్యాంకులకు రూ.10వేల కోట్ల వరకు చెల్లించకుండా బ్రిటన్లో ఉంటున్నాడు. అతని నుండి ఈ మొత్తం వసూలు చేసుకునేందుకు బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాంకులకు పూర్తి గ్యారెంటీ ఉందని మాల్యా పేర్కొన్నారు. రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న లండన్ కోర్టు జడ్జి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్ను ఏప్రిల్ 10న కొట్టివేశారు.
సెటిల్మెంట్ కుదరదు
ఈ తీర్పుపై బ్యాంకింగ్ కన్సార్టియం తిరిగి అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్ వివరించింది. మాల్యా ప్రతిపాదించిన సెటిల్మెంట్ ఆఫర్ యునైటెడ్ బ్రీవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ (UBHL) ఆస్తులను బ్యాంకులు హైకోర్టులో ప్రస్తావిస్తూ.. ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ కింద ఉన్నాయని, మాల్యాకు గానీ లేదా ఒకప్పటి UBHL యాజమాన్యానికి గానీ ఇవి అందుబాటులో లేవని, ఇలాంటి పరిస్థితుల్లో సెటిల్మెంట్ ఆఫర్కు మాల్యా ఆయా ఆస్తులపై ఆధారపడలేరని తెలిపింది. అలాగే మాల్యా పేర్కొన్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ కాదని పేర్కొంది. బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ అని, బ్యాంకింగ్ తాజా పిటిషన్ను కొట్టివేయాలని మాల్యా తరఫు లీగల్ టీమ్ కోరింది.