Bank News: అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఇక అక్కర్లేదా..? కేంద్ర మంత్రి క్లారిటీ..
Minimum Balance: దేశం డిజిటల్ రూపు దిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు అందాలన్నా లేక పెద్ద మెుత్తంలో చెల్లింపులు చేయాలన్నా బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే చాలా మందికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆయా ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి రావటమే.
కేంద్ర సహాయ మంత్రి..
బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని వారి అకౌంట్లపై బ్యాంకులు పెనాల్టీలను వసూలు చేస్తుంటాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సమస్య తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ పెనాల్టీలను మాఫీ చేయటంపై సదరు బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్రావ్ కరాద్ స్పష్టం చేశారు. స్వతంత్ర సంస్థలుగా బ్యాంక్ బోర్డులకు ఈ అధికారం ఉందని తెలిపారు.
కేంద్రం త్వరలో..
బ్యాంకులు ఖాతాదారులకు నిర్థేశించిన కనీస మెుత్తాన్ని ఖాతాల్లో ఉంచకపోయినప్పటికీ ఎటువంటి పెనాల్టీ చేయకుండా కేంద్రం త్వరలోనే బ్యాంకులకు ఆదేశాలు జారీకి పరిశీలన జరుగుతోందని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ బ్యాంకులు..
కేంద్ర పాలిత ప్రాంతంలో వివిధ ఆర్థిక పథకాల అమలును సమీక్షలో భాగంగా పర్యటనలో ఉన్న కరద్ జమ్మూ కాశ్మీర్లోని బ్యాంకుల పనితీరును కొనియాడారు. జన్ ధన్ యోజన ఖాతాలను పెంచాలని సూచించారు. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 58 శాతంగా ఉందన్నారు. మార్చి 2023 నాటికి 20 కొత్త బ్యాంక్ శాఖలతో పాటు మరిన్ని ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలను ప్రారంభించారు.
Minimum Balance అంటే..
ఎవరైనా బ్యాంక్ ఖాతాలను వసూలు చేసేటప్పుడు సదరు బ్యాంక్ తన రూల్స్ ప్రకారం కొంత మెుత్తాన్ని ఎల్లప్పుడూ ఖాతాలో ఉంచాలని సూచిస్తుంది. ఇది వివిధ బ్యాంకులకు వేరువేరుగా ఉంటుంది. బ్యాంక్ ఉన్న ప్రాంతాన్ని బట్టి కూడా ఇది మారిపోతుంటుంది. ప్రైవేటు రంగంలోని బ్యాంకులకు మినిమం బ్యాలెన్స్ భారీగా ఉంటుంది. వీటిని సరిగా నిర్వహించని పక్షంలో సదరు బ్యాంకులు ఖాతాదారునిపై పెనాల్టీ విధిస్తుంటాయి. అందుకే అనవసరంగా బ్యాంక్ ఖాతాలను ఎక్కువ సంఖ్యలో కలిగి ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. వినియోగించని ఖాతాలను మూసివేయటం ఉత్తమం.