COVID 19: బజాజ్ ఆటో సేల్స్, ఐనా ఉద్యోగులకు శాలరీపై గుడ్న్యూస్
ఉద్యోగులకు బజాజ్ ఆటో గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు కార్మికులతో పాటు తమ సిబ్బందికి అందరికీ ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్తి వేతనం చెల్లిస్తామని, ఎలాంటి కోత విధించడం లేదని బజాజ్ ఆటో వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు 10 శాతం వేతనం కోత విధించాలని కంపెనీ గతంలో నిర్ణయించింది.
Lockdown 3.0: ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం.. సీఈవోలు ఏమన్నారు, ఉద్యోగాల కోతపై..
అందుకే ఉద్యోగుల వేతనంలో కోత లేదు
ఉద్యోగులకు 10 శాతం వేతనం కోత విధించాలనే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. అందరికీ పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆదివారం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో తెలిపింది. లాక్ డౌన్ సమయంలో సమాజానికి సాయం చేసే ముందు తొలుత కంపెనీ సిబ్బంది బాధలు లేకుండా చూడటం ముఖ్యమని పేర్కొంది.
మే నెలపై సమీక్ష
సంస్థ వ్యాపారంలో ఉద్యోగులంతా భాగస్వాములేనని, సమాజానికి సాయం చేసే ముందు మనమందరం మన కుటుంబాలు భద్రంగా ఉండేలా చూసుకోవాలని, కాంట్రాక్టు కార్మికుల పిల్లలు కూడా ఎవరూ ఆకలితో ఉండకూడదని, అందుకే ఏప్రిల్ నెల వేతనం పూర్తిగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. మే ఆఖరుకు మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామని, తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
సేల్స్ జీరో..
ఇదిలా ఉండగా, ఏప్రిల్ నెలలో ఒక్క టూవీలర్ లేదా కమర్షియల్ వాహనాన్ని విక్రయించలేదని బజాజ్ ఆటో తెలిపింది. డొమెస్టిక్ సేల్స్ జీరోగా ఉన్నప్పటికీ 32,009 టూవీలర్స్ను ఎగుమతి చేసినట్లు తెలిపింది. డొమెస్టిక్గా కమర్షియల్ వెహికిల్ సేల్స్ సున్నా అని, 5,869 వాహనాలు ఎగుమతి చేసినట్లు తెలిపింది. మొత్తం 37,878 యూనిట్లు సేల్ చేశామని, అది కూడా కేవలం ఎగుమతులే అని తెలిపింది. 2019 ఇదే ఏప్రిల్ నెలలో 4,23,315 వాహనాలు సేల్ చేసింది. నాటితో పోలిస్తే 91 శాతం సేల్స్ తగ్గాయి.