బ్యాడ్ బ్యాంకుకు 80 పెద్ద ఎన్పీఏ ఖాతాలు, రూ.2 లక్షల కోట్లు..
బ్యాంకులపై ఎన్పీఏల భారం తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ భారాన్ని వచ్చే నెలలో ఏర్పాటు చేసే జాతీయ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(NARCL) లేదా బ్యాడ్ బ్యాంకుకు బదలీ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాంకులు ఇందుకోసం ఇప్పటికే ఒక్కోటి రూ.500 కోట్లకు పైగా ఉన్న 80 వరకు పెద్ద మొండి పద్దుల ఖాతాలను గుర్తించాయి. ఈ ఖాతాల మొత్తం రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
గత ఏడాది మార్చి నాటికి భారత బ్యాంకింగ్ రంగం దాదాపు రూ.12 లక్షల కోట్ల మొండి బకాయిలు కలిగి ఉంది. బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఎన్పీఏ ఆస్తులను మళ్లీ వెలకట్టి అందులో 15 శాతాన్ని బ్యాడ్ బ్యాంకు రావాల్సిన బ్యాంకులకు చెల్లిస్తుంది. మిగతా 85 శాతం వాటి అమ్మకం ద్వారా వచ్చే నిధుల నుండి చెల్లిస్తుంది. ఈ 85 శాతం మొత్తానికి ప్రభుత్వ హామీ ఉంటుంది.
ఆస్తుల అమ్మకంపై నష్టం వచ్చినపుడు మాత్రమే చెల్లింపులపై బ్యాంకులకు ప్రభుత్వ హామీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఎన్పీఏల కోసం బ్యాంకులు పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయవలసి వస్తోంది. లాభాలపై ప్రభావం చూపుతోంది. మొండి బకాయిలు, బ్యాడ్ బ్యాంకుకు బదలీ అయితే బ్యాంకులకు ఇబ్బందులు తప్పుతాయి. బ్యాలెన్స్ షీట్ల ప్రక్షాళన జరిగి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.