Covid 19: ప్రపంచంలో 3వ అతిపెద్ద విరాళం అజిమ్ ప్రేమ్జీదే
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారిపై పోరుకు కార్పోరేట్ సంస్థలు, యజమానులు పెద్ద మొత్తంలో నిధులు విరాళంగా ప్రకటించారు. మన దేశంలో టాటా సన్స్ అధినేత రతన్ టాటా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని, విప్రో అజీమ్ ప్రేమ్జీ వేలకోట్లు ఇచ్చారు. అయితే కొందరు కంపెనీ తరఫున, మరికొంతమంది వ్యక్తిగతంగా, ఇంకొంతమంది తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిధులు ఇచ్చారు. ఫోర్బ్స్ టాప్ 10 ప్రయివేటు విరాళాలలో అజీమ్ ప్రేమ్జీది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విరాళం.
ఆర్థిక వ్యవస్థ మరింత దారుణం: అమెరికా-చైనా ట్రేడ్ వార్తో కరోనా రికవరీపై దెబ్బ
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విరాళం
కరోనాపై పోరుకు విరాళంగా ఇచ్చిన ప్రపంచ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుడు అజీమ్ ప్రేమ్జీ మాత్రమే. ప్రేమ్జీ రూ.1,125 (132 మిలియన్లు) కోట్ల మొత్తం ప్రకటించారు. మహమ్మారిపై పోరు చేస్తున్న సిబ్బందికి సహాయం కోసం ఈ మొత్తం ప్రకటించారు. ఈ మొత్తంలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లు, విప్రో రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25 కోట్లు ఇచ్చింది.
టాప్ 3లో జాక్, బిల్గేట్స్, ప్రేమ్జీ
ఏప్రిల్ చివరి నాటికి ఫోర్బ్స్ జాబితా ప్రకారం 77 మంది బిలియనీర్లు కరోనాపై పోరుకు వివిధ అవసరాల నిమిత్తం వేల కోట్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారిలో మొదటి స్థానంలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఉన్నారు. అతను 1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఇచ్చారు. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ఉన్నారు. వీరు 255 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,925 కోట్లు) ఇచ్చారు. మూడో స్థానంలో అజీమ్ ప్రేమ్జీ ఉన్నారు.
మిగతా 7గురు వీరే..
మిగతా 7గురు వీరే... సోరోస్ ఫండ్ మేనేజ్మెంట్ ఫౌండర్ జార్జ్ సోరోస్ 130 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
5వ స్థానంలో ఫోర్ట్స్కూ మెటల్స్ స్టాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆండ్రూ ఫోరెస్ట్ (100 మిలియన్ డాలర్లు),
6వ స్థానంలో స్కోల్ ఫౌండర్ అండ్ చైర్మన్ జెఫ్ స్కోల్ (100 మిలియన్ డాలర్లు),
7వ స్థానంలో అమెజాన్ సీఈవో అండ్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (100 మిలియన్ డాలర్లు),
8వ స్థానంలో డెల్ ఫౌండర్ అండ్ సీఈవో మైఖేల్ డెల్ (100 మిలియన్ డాలర్లు),
బ్లూమ్బర్గ్ ఎల్పీ ఓనర్ మైఖేల్ బ్లూమ్బర్గ్ 74.5 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో,
శాంసన్ ఎనర్జీ నుండి లిన్ అండ్ స్టాసీలు (70 మిలియన్ డాలర్లు)తో 10వ స్థానంలో నిలిచారు.
ముఖేష్ అంబానీ భారీ విరాళం
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ రూ.500 కోట్లు (67 మిలియన్లు) పీఎం కేర్స్ ఫండ్కు ఇచ్చారు. రూ.5 కోట్ల చొప్పున మహారాష్ట్ర, గుజరాత్లకు... ఈ రెండు రాష్ట్రాలకు రూ.10 కోట్లు ఇచ్చారు. 100 బెడ్స్తో ముంబైలో అత్యాధునిక కరోనా హాస్పిటల్ నిర్మించారు. ముంబైలో పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఎమర్జెన్సీ వాహనాలకు ఉచితంగా ఇంధనం. హెల్త్ వర్కర్స్కు రిలయన్స్ నుండి 100,000 మాస్కులు సరఫరా.
టాటా సన్స్ విరాళం
టాటా సన్స్ అధినేత రతన్ టాటా రూ.500 కోట్లు (67 మిలియన్ డాలర్లు) విరాళంగా ఇచ్చారు. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కంపెనీ తరఫున రూ.1,000 కోట్లు (134 మిలియన్ డాలర్లు) కరోనాపై పోరుకు విరాళంగా ప్రకటించారు. అంతేకాదు, టాటా గ్రూప్ వెంటిలెటర్లు తయారు చేస్తామని కూడా అప్పుడు ప్రకటించింది.
కోట్లాది రూపాయల విరాళాలు
మ్యాన్కైండ్ ఫార్మా అధినేత రమేష్ జునేజా రూ.51 కోట్లు (7 మిలియన్ డాలర్లు), టీవీఎస్ మోటార్స్ రూ.25 కోట్లు (3.3 మిలియన్ డాలర్లు), ఉదయ్ కొటక్ రూ.25 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.35 కోట్లు ప్రకటించారు. ఏషియన్ పేయింట్స్ రూ.35 కోట్లు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ఇచ్చారు. బీసీసీఐ రూ.51 కోట్లు ఇచ్చింది.