అజీమ్ ప్రేమ్జీ విరాళం రోజుకు రూ.22 కోట్లు! రెండో స్థానంలో శివ్నాడర్
బెంగళూరు: 2020 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా దాతృత్వ కార్యకలాపాలకు నిధులు వెచ్చించిన వారిలో విప్రో ఫౌండర్ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ముందున్నారు. హురున్ రిపోర్ట్ ఇండియా ప్రకారం ఆయన రూ.7,904 కోట్ల డొనేషన్స్ ఇచ్చారు. ఈ లెక్కన రోజుకు రూ.22కోట్లు దాతృత్వ కార్యకలాపాల కోసం వినియోగించినట్లు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ వైరస్ పైన పోరుకు విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.1,125 కోట్ల విరాళం ప్రకటించింది. దేశంలో దాతృత్వ కార్యకలాపాలకు అజీమ్ ప్రేమ్జీ ఓ రోల్ మోడల్ అని, ఇతరులు ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారని హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రీసెర్చర్ అన్నారు.
1.5 లక్షల మంది ఉద్యోగులకు విప్రో శుభవార్త, డిసెంబర్ 1 నుండి శాలరీ పెంపు
అజీమ్ ప్రేమ్జీ తర్వాత శివ్ నాడర్, ముఖేష్ అంబానీ
ఈ ఏడాది రూ.7,904 కోట్లు విరాళంగా ఇచ్చి అజీమ్ ప్రేమ్జీ మొదటి స్థానంలో నిలవగా, హెచ్సీఎల్ టెక్నాలజీస్కు చెందిన శివ్ నాడర్ రెండో స్థానంలో నిలిచారు. శివ్ నాడర్ రూ.795 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.458 కోట్ల విరాళంతో మూడో స్థానంలో ఉన్నారు. కరోనాపై పోరు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 30న పీఎం కేర్స్ ఫండ్స్కు రూ.500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ.5 కోట్ల చొప్పున అందించింది.
40 ఏళ్ల లోపు బిన్నీ బన్సాల్, మహిళల్లో రోహిని నీలేకని
రూ.276 కోట్ల విరాళంతో కుమార్ మంగళం బిర్లా, కుటుంబ సభ్యులు నాలుగో స్థానంలో నిలిచారు. వేదాంత అధినేత అనిల్ అగర్వాల్, కుటుంబం రూ.215 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. తన సంపాదనలో 75 శాతం చారిటీకి వినియోగిస్తానని 2014 సెప్టెంబర్లో అనిల్ అగర్వాల్ ప్రకటించారు. 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన మొత్తాల ఆధారంగా లెక్కించారు. 40 ఏళ్ల లోపు పారిశ్రామికవేత్తల్లో భారీగా విరాళాలు ఇచ్చిన వారిలో బిన్నీ బన్సాల్ ముందున్నారు. 21 మంది పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా రూ.5 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. 112 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నిలేకని నిలిచారు.
కరోనాపై పోరుకు భారీ విరాళం
కరోనాపై పోరుకు టాటా సన్స్ రూ.1500 కోట్లు, అజీమ్ ప్రేమ్జీ రూ.1125 కోట్లు, ముఖేష్ అంబానీ రూ.510 కోట్లు విరాళంగా ప్రకటించారు. అజీమ్ ప్రేమ్జీ మొత్తం విరాళాలు 175 శాతం పెరిగి రూ.12,050 కోట్లకు చేరుకున్నాయి. రూ.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వారి సంఖ్య 78కి చేరుకుంది. నందన్ నీలేకని రూ.159 కోట్లు, ఎస్ గోపాలకృష్ణన్ రూ.50 కోట్లు, శిబులాల్ రూ.32 కోట్లు డొనేట్ చేశారు.