ఉద్యోగాల కోత వద్దు, శాలరీ కట్ చేయవద్దు, అమెరికాలో లక్షల జాబ్ కట్స్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక మందగమనం ముప్పు పొంచి ఉంది. దీంతో కంపెనీలు వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల తొలగింపు లేదా శాలరీ కట్ వంటి వాటిని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు మానవాదృక్పథంతో ఆలోచించాలని ప్రభుత్వాలు, నిపుణులు సూచిస్తున్నారు.
వేతనాలు ముందే ఇచ్చిన కొటక్ మహీంద్రా, ఎన్నో జాగ్రత్తలు
వేతనాల కోత, జాబ్ కట్
కరనా కారణంగా కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు మూతబడ్డాయి. దీంతో ప్రతి రంగానికి పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. దీని నుండి కోలుకునేందుకు కంపెనీలు వేతనాల కోత లేదా ఉద్యోగాల తొలగింపు చేపట్టరాదని అంటున్నారు. తయారీ రంగం సహా వివిధ రంగాల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పటికే రోజువారీ వేతనాలు కోల్పోతున్నారు. ప్లాంట్లు క్లోజ్ చేయడంతో వేతనాల కోత, నిలిపివేత వద్దని సూచిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి
కరోనా కారణంగా అంతర్జాతీయవ్యాప్తంగా వ్యాపారాలు కూడా మూత పడటంతో వచ్చే కొద్ది వారాల్లోనే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సునామీని సృష్టిస్తుందని తెలిపింది. జాబ్ కట్ పెరగడం, వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గటం వంటి వివిధ కారణాలతో ఆర్ధిక వ్యవస్థలు మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని మూడీస్ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.
వృద్ధి రేటు 0.4 శాతానికి
రానున్న కొద్ది వారాల్లో ముఖ్యంగా హౌస్ హోల్డ ఉద్యోగాలు లక్షల్లో కోల్పోయే ప్రమాదముందని అంచనా వేశారు. ఈ ఏడాది జనవరిలో కరోనా బయటపడిన కొత్తలో ఈ ఏడాది ప్రపంచ వాస్తవ జీడీపీ 2.6% ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. కానీ ఈ మహమ్మారి విజృంభించడంతో 2020లో 0.4% పరిమితం కావచ్చని ఇటీవల అంచనా వేసింది.
అమెరికాలో లక్షల ఉద్యోగాలు..
పర్యాటక రంగం, వాణిజ్యం సహా అన్ని రకాల వ్యాపారాలు క్లోజ్ అయ్యాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందని మూడీస్ ఇటీవల తెలిపింది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నవారి సంఖ్య వారానికి 2 లక్షల దాకా ఉందని చెబుతున్నారు. ఇటీవల 3.3 మిలియన్ల మంది నిరుద్యోగ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇది రికార్డ్. వ్యాపారాలన్ని ఒక్కసారిగా ఆగిపోవటం ఆర్థిక వ్యవస్థలకు దారుణమైన నష్టం కలిగిస్తోంది.