దిగ్గజ కంపెనీలను, అదానీ, మిట్టల్ను వెనక్కి నెట్టి.. టాప్ 10 కుబేరుల్లో డీమార్ట్ అధినేత
అవెన్యూ సూపర్ మార్ట్స్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ ఇండియా ఆరో కుబేరుడిగా అవతరించారు. అతని సంపద 11.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అవెన్యూ సూపర్ మార్ట్స్.. డీ-మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ స్టాక్స్ ఆల్ టైమ్ హైకి చేరుకోవడంతో దమానీ ఆస్తి భారీగా పెరిగింది.
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, ఈ రోజు నుండే అమల్లోకి.. ఎంత పెరిగిందంటే?
అదానీ, మిట్టల్ను దాటిన దమానీ
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం రాధాకిషన్ దమానీ ఆస్తులు గౌతమ్ అదానీ (10.8 బిలియన్ డాలర్లు), సునీల్ మిట్టల్ (9.6 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ. అవెన్యూ సూపర్ మార్ట్స్ మూడేళ్ల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అప్పటి నుండి జోరు మీద ఉంది. దీంతో ఇప్పుడు టాప్ 10లోకి దమాని వచ్చారు.
రూ.1.5 లక్షల మార్కెట్ వ్యాల్యూను అధిగమించింది
ఇటీవల సోమవారం నాటికి ఈ కంపెనీ రూ.1.5 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూను అధిగమించింది. దీంతో నెస్ట్లే, బజాజ్ ఫిన్ సర్వ్ వంటి సంస్థలను వెనక్కి నెట్టింది. దేశంలోనే అత్యంత మార్కెట్ వ్యాల్యూ కలిగిన కంపెనీల్లో 18వ స్థానంలో నిలిచింది. గతవారంలో ఫిబ్రవరి 5వ తేదీన కంపెనీ సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం షేర్ల విక్రయాన్ని ప్రకటించింది. దీంతో సోమవారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
భారీగా షేర్
ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేర్ ధర రూ.2,049 వద్ద మొత్తం రూ.4వేల కోట్లను సమీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో షేర్ ధర రెండు రోజుల క్రితం 8.5% పెరిగి రూ.2,484.15 వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1.55 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బజాజ్ ఫిన్సర్వ్, నెస్ట్లేలను అధిగమించి బీఎస్ఈ కంపెనీల్లో పద్దెనిమిదవ అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది.
మూడేళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.8 లక్షలు
లిస్టింగ్ తేది మార్చి 31 నాటి నుంచి సోమవారం ముగింపు నాటికి షేర్ ధర 290% పెరిగింది. ఈ ఏడాదిలో కంపెనీ మొత్తంగా 35% ర్యాలీ చేసింది. 21 మార్చి 2017న కంపెనీ నమోదయింది. ఏకంగా రూ.39,988 కోట్ల మార్కెట్ వ్యాల్యూను సొంతం చేసుకుంది. ఒకవేళ లిస్ట్లో ఒక ఇన్వెస్టర్ రూ.1లక్షల విలువ చేసే షేర్లను కొనుగోలు చేస్తే సోమవారం ముగింపు సమయానికి సదరు ఇన్వెస్టర్ మొత్తం రూ.8.31లక్షలను చేరుకుంటుంది.
అలా ఇన్వెస్ట్ చేస్తే రూ.4 లక్షలు
మార్చి 21, 2017న అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ ధర రూ.640.75గా ఉంది. ఫిబ్రవరి 10, 2020 నాటికి రూ.2,484.15కు చేరుకుంది. ఆ సమయంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.4 లక్షల దాకా అయ్యేది. పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరు రూ.300కు లభించి ఉంటే అదే రూ.1 లక్ష రూ.8 లక్షలు అయి ఎనిమిది రెట్లు పెరిగి ఉండేది.
భారీగా పెరిగిన దమానీ నికర వ్యాల్యూ
కంపెనీ అధినేత దమానీ నికర వ్యాల్యూ రూ.84,000 కోట్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ నికర వ్యాల్యూ రూ.76,000 కోట్లు, సునీల్ మిట్టల్ నికర వ్యాల్యూ రూ.67,000 కోట్లుగా ఉంది. విప్రో, ఓఎన్జీసీ, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సురెన్స్ కంటే డిమార్ట్ వ్యాల్యూ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 25 బ్రోకరేజీ సంస్థల్లో 11 సంస్థలు కొనమని రేటింగ్ ఇవ్వగా, తొమ్మిది సంస్థలు అమ్మాలని రేటింగ్ ఇచ్చాయి.
భారత టాప్ టెన్ కుబేరులు
నిరర విలువ పరంగా భారత టాప్ టెన్ కుబేరుల్లో ముఖేష్ అంబానీ (రూ.3,88,000 కోట్లు), అజీమ్ ప్రేమ్జీ (రూ.1,28,000 కోట్లు), శివనాడార్ (రూ.1,17,000 కోట్లు), ఉదయ్ కొటక్ (రూ.1,02,000 కోట్లు), లక్ష్మీ మిట్టల్ (రూ.93,000 కోట్లు), దమానీ (రూ.84,000 కోట్లు), గౌతమ్ అదానీ (రూ.76,000 కోట్లు), సునీల్ మిట్టల్ (రూ.67,000 కోట్లు), సైరస్ పూనావాలా (రూ.65,000 కోట్లు), బెను బంగ్వార్ (రూ.56,000 కోట్లు) ఉన్నారు.