'ఈ స్కీంను ఉపయోగించుకోండి, మార్చి 31 దాటితే వడ్డీ, పెనాల్టీ'
2016లో నోట్లరద్దు తర్వాత ఆదాయపు పన్ను నోటీసులు అందుకున్న వారు బడ్జెట్లో ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే అన్నారు. ఎలాంటి వివరాలు లేకుండా క్యాష్ డిపాజిట్ చేసిన వారికి ఇది వర్తిస్తుందని తెలిపారు. తనిఖీలలో దొరికిన కేసులకు ఈ స్కీం వర్తించదను తెలిపారు. 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లరద్దుని ప్రకటించిన విషయం తెలిసిందే.
అందుకే వివాద్ సే విశ్వాస్
తాము ఫ్రేమ్ వర్క్తో ముందుకు వస్తామని, నోట్ల రద్దు సమయంలోను కొన్ని కేసులను పరిష్కరిస్తామని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. అంటే వివాదాలు వద్దు.. విశ్వాసం ముద్దు అని అర్థం. ఆర్థిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు దీనిని తీసుకు వచ్చినట్లు తెలిపారు.
మార్చి 31లోగా వడ్డీ, పెనాల్టీ మినహాయింపు
పన్ను చెల్లింపుదారులు చేసిన అప్పీళ్లను ఏ స్థాయిలో పెండింగులో ఉన్నా సరే ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు. 2020 జూన్ 30వ తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. అయితే మార్చి 31వ తేదీలోగా ఈ పథకాన్ని ఉపయోగించుకునే చెల్లింపుదారులు కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీలు, పెనాల్టీ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
మార్చి 31 దాటితే
మార్చి 31వ తేదీ తర్వాత ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే మాత్రం కొంత మొత్తం అదనంగా చెల్లించవలసి ఉంటుంది. అప్పుడు వడ్డీ, పెనాల్టీలు కూడా చెల్లించవలసి ఉంటుంది. అదనపు చెల్లింపులతో జూన్ 30వ తేదీ వరకు ఈ స్కీంను ఉపయోగించుకోవచ్చు.
పెండింగులో కేసులు..
దేశవ్యాప్తంగా 4,83,000 ప్రత్యక్ష పన్నుల కేసులు పెండింగులో ఉన్నాయి. పరోక్ష పన్నుల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు గత బడ్జెట్లో సబ్ కా విశ్వాస్ పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ స్కీం ద్వారా 1,89,000 కేసులు పరిష్కారం అయినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.