లాక్ డౌన్ తర్వాత... అనుకున్న దాని కంటే వేగంగా పుంజుకుంటున్న ఆటోమోటివ్ ఇండస్ట్రీ...
భారత్లో కరోనా లాక్ డౌన్ తర్వాత ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనుకున్న దాని కంటే వేగంగా పుంజుకుంటోందని సుజుకి మోటార్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకి అన్నారు. ఇదో సానుకూల పరిణామం అని పేర్కొన్నారు. సుజుకి అంచనాల ప్రకారం 2030 నాటికి భారత్లో తమ సంస్థ 10 మిలియన్ల కార్ల అమ్మకాలు చేపడుతుందన్నారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సెషన్ 60వ ఎడిషన్ సందర్భంగా తొషిహిరో సుజుకి మాట్లాడారు.
రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని తొషిహిరో అన్నారు. తద్వారా మాన్యుఫాక్చరింగ్ రంగం,ఆటోమోటివ్ రంగంలో వృద్ది నమోదవుతుందన్నారు. సుజుకి మోటార్ కార్పోరేషన్ చైర్మన్,తొషిహిరో సుజుకి తండ్రి ఒసము సుజుకి కూడా మార్కెట్ పుంజుకుంటుందని వీడియో సందేశం ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితికి చేరుకోవాలంటే...కంపెనీ సభ్యులుగా అందరూ తమవంతు కృషి చేయాలని చెప్పారు. ఉత్పాదకత,విక్రయాల పెరుగుదలకు కృషి చేయాలన్నారు.
భారత్తో తన అనుబంధం గురించి చెబుతూ.. ఇటీవల టోక్యోలోని భారత అంబాసిడర్ తనకు కట్టిన రాఖీని ఒసము సుజుకి అందరికీ చూపించారు. ఇదో అందమైన రాఖీ అని... భారత్తో తమ అనుబంధాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మేకిన్ ఇండియా,ఆత్మనిర్భర్ భారత్ కోసం తాము కూడా కలిసి పనిచేయాలనుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీకి 'క్వాలిటీ ఇన్ ఇండియా' పిలుపునిచ్చారు. గ్లోబల్ కస్టమర్లను ఆకర్షించాలంటే 'క్వాలిటీ ఇన్ ఇండియా'పై ఫోకస్ చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్లో చిన్న కార్ల ఎగుమతి రంగం తిరిగి పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు.