చరిత్రలో తొలిసారి 'జీరో', ఆటో పరిశ్రమకు రూ.1 కోట్లకు పైగా నష్టం: ప్రభుత్వ ఆదాయానికి గండి
కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో మారుతీ సుజుకీ అమ్మకాలు ఏప్రిల్ నెలోల జీరోకు పడిపోయాయి. ఈ కంపెనీ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. మిగతా ఆటో దిగ్గజాల సేల్స్ కూడా జీరోకు పడిపోయాయి. మహీంద్రా, హ్యుండాయ్, టయోటా కిర్లోస్కర్, MG ఒక్క వాహనాన్ని విక్రయించలేదు. మారుతీ సుజుకీ ముంద్రా రేవు నుంచి 632 వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. హ్యుండాయ్ 1,341 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ప్రీమియం బైక్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం 91 వాహనాలను విక్రయించింది.
COVID 19: షాకింగ్: ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ సేల్స్ 'జీరో'
రూ.1 లక్ష కోట్లకు పైగా నష్టం
కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశీయ వాహన రంగానికి రూ.1.25 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చునని అంచనా. లాక్డౌన్తో ఆటో పరిశ్రమకు రోజుకు రూ.2,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని సియామ్ తెలిపింది. మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించడంతో 54 రోజుల లాక్ డౌన్ కాలంలో రూ.లక్ష కోట్ల కంటే చాలా ఎక్కువ మొత్తం నష్టం వాటిల్లనుందని అంచనా.
ప్రభుత్వాలకు రెవెన్యూ నష్టం
కేంద్రానికి కూడా ఆదాయం పెద్ద మొత్తంలో తగ్గనుంది. ఆటో రంగం నుండి కేంద్రానికి జీఎస్టీ ద్వారా వసూలయ్యే రూ.38,000 కోట్లు గండిపడే అవకాశముంది. రాష్ట్రాలకు రూ.19,000 కోట్ల వరకు పన్నులు నష్టపోవచ్చునని అంచనా. జీఎస్టీ వసూళ్లలో 15 శాతం ఆటో రంగం నుండి వస్తున్నాయి. 57 శాతం రాష్ట్రాల వార్షిక పన్ను వసూళ్లలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా సమకూరుతుంది. ఈ మేరకు ప్రభావం పడనుంది. కొన్ని ప్లాంట్స్ల్లో ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఉంది. కానీ విడిభాగాల కొరత, షోరూమ్స్ తెరుచుకోని ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాల నిల్వలు పేరుకుపోయే అవకాశముంటుంది.
పదేళ్ల కనిష్టానికి సేల్స్
కరోనా దెబ్బ కారణంగా ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో వాహనాల సేల్స్ వార్షిక ప్రాతిపదికన 50 శాతం తగ్గవచ్చునని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆటో సేల్స్ 2010 కనిష్టానికి పడిపోవచ్చునని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హ్యుండాయ్, మెర్సిడెజ్ బెంజ్, స్కోడా ఇండియా వంటి ఆటో కంపెనీలు విక్రయాల కోసం డిజిటల్ బాట పట్టాయి. లాక్ డౌన్ ఎత్తేశాక వాటిని డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. మిగతా సంస్థలు ఇదే బాట పట్టవచ్చు.