మందగమనం ఉన్నా మారుతి, హ్యూండాయ్ కంపెనీల దూకుడు! రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న కంపెనీలు
ఇండియా లో ఆర్థిక మందగమనం తీవ్ర రూపం దాల్చుతున్నా... కార్ల కంపెనీలు మాత్రం భవిష్యత్ పై బంగారు కలలు కంటున్నాయి. అసలు మందగమనం మొదలైంది ఆటోమొబైల్ రంగం నుంచే అయినప్పటికీ అవేం లెక్కచేయటం లేదు. దేశంలోని రెండు అతిపెద్ద కార్ల కంపెనీలు... మారుతి సుజుకి, హ్యుండై మోటార్స్ సహా మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు రూ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మారుతున్నకాలుష్య నియంత్రణ నిబంధనలు అమలు చేస్తూ... సరికొత్త టెక్నాలజీ లను పరిచయం చేస్తూ కొత్త మోడల్స్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నాయి. ఎలక్ట్రిక్ మోడల్స్ మొదలు కొని అన్ని విభాగాల్లోనూ వినియోగదారులను కట్టిపడేసే ఫీచర్స్ తో మార్కెట్ ను అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ అందించే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక ఏడాది లోపే కనీసం 12 కొత్త మోడల్స్ ఇండియన్ రోడ్స్ పై షికార్లు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆటోమొబైల్ వర్గాల సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక ప్రత్యేక కథనం.
రూ 30,000 కోట్లు...
భారత్ లో ప్రతి రెండు కార్లలో ఒకటి విక్రయించే మారుతి సుజుకి, రెండో స్థానంలో ఉండే హ్యుందాయ్ మోటార్స్, ఎస్ యూ వీ ల మార్కెట్ లీడర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ విషయంలో చాలా ముందున్నాయి. కేవలం ఈ మూడు కంపెనీల సంయుక్త పెట్టుబడి విలువే రూ 15,000 కోట్ల మేరకు ఉండబోతోంది. వచ్చే ఏడాది కాలంలో ఇవి ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. మిగితా అన్ని కంపెనీలు కలిసి మొత్తం మీద ఒక ఏడాది కాలంలో సుమారు రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఒక్కో కొత్త ప్లాట్ ఫారం పై కొత్త వాహనాన్ని అభివృద్ధి చేసేందుకు రూ 1,200 కోట్ల నుంచి రూ 1,500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా వెల్లడించారు.
మార్కెట్లోకి బీఎస్ - 6 కార్లు...
పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు భారత్ కట్టుబడి ఉంది. అందుకే... స్వయంగా భారత్ - 6 ఉద్గార నియంత్రణ నిబంధనలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు కూడా తక్కువ కాలుష్యం విడుదల చేసేలా తమ కొత్త కార్ల మోడల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ఈ మేరకు మారుతి సుజుకి తన విటారా బ్రేజా, ఎర్టిగా, ఎస్ క్రాస్ మోడల్స్ ను బీ ఎస్ -6 నిబంధనల ప్రకారం మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. అలాగే హ్యుండై మోటార్స్ కూడా క్రెటా, ఎలైట్ ఐ 20, వెర్నా పేస్ లిఫ్ట్ మోడల్స్ ను ప్రవేశపెట్టనుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా థార్, స్కార్పియో, ఎక్స్ యూ వీ 500 మోడల్స్ ను సరికొత్తగా లాంచ్ చేయబోతోంది. టాటా మోటార్స్ కూడా ఎస్ యూ వీ గ్రావిటిస్ తో పాటు మరికొన్ని కాన్సెప్ట్ కార్లను ప్రవేశపెట్టబోతోంది. తద్వారా భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది.
గుజరాత్ లో మారుతి కొత్త ప్లాంటు...
మారుతి సుజుకి గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్న మూడో కొత్త ప్లాంటు ఈ ఏడాది మధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం మారుతి సుజుకి ఏకంగా రూ 5,000 కోట్ల నుంచి రూ 6,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్నీ కంపెనీ ఎండీ కేనచి ఆయుకవా వెల్లడించారు. త్వరలోనే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పుంజుకుంటుందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోకి కొత్తగా రంగ ప్రవేశం చేసిన కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ ఇక్కడ విజయాన్ని నమోదు చేశాయి. కియా మోటార్స్ సెల్తో సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఎంజీ మోటార్స్ కు చెందిన హెక్టర్ మోడల్ కూడా వినియోగదారుల మనసు గెలిచింది. ఈ అంశాలు కూడా ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీల ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చాయి. మారుతున్న వినియోగదారుల అభిరుచి మేరకు కొత్త మోడల్స్ ఉంటే ... అమ్మకాలు వాటంతట ఏవే పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి.