ఆగస్ట్లో 9 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు, జాబ్ మార్కెట్ రికవరీ..
కార్మిక రాజ్య బీమా సంస్థ(ESIC) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలో (సోషల్ సెక్యూరిటీ స్కీం) 2020 ఆగస్ట్ నెలలో 9.3 లక్ష మందికి పైగా ఉద్యోగంలో చేరారు. జూలైలో ఈ పథకంలో 7.55 లక్షలమంది చేరినట్లు తెలిపింది. ఎన్ఎస్ఓ శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే దేశంలో జాబ్ మార్కెట్ కోలుకుంటోందని అర్థమవుతోంది. 2020 జూన్ నెలలో 8.21 లక్షల మంది, మే నెలలో 4.84 లక్షల మంది, ఏప్రిల్ నెలలో 2.61 లక్షల మంది ESICలో కొత్తగా నమోదు చేయించుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి.
పండుగ సీజన్లో 65% బంగారం వ్యాపారం, ధర కలిసి వస్తోంది..
కోలుకుంటున్న జాబ్ మార్కెట్
ESIC సోషల్ సెక్యూర్టీ స్కీంలో 9.3 లక్షలమంది కొత్తగా చేరగా, అదే ఆగస్ట్ మాసంలో ఈపీఎఫ్ స్కీంలో 6.7 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ రెండింటి నెంబర్స్ కూడా జాబ్ మార్కెట్ క్రమంగా కోలుకుంటుందనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం జూలై నెలలో ESIC స్కీంలో 7.5 లక్షల మంది, ఈపీఎఫ్ స్కీంలో 6.5 లక్షలమంది చేరారు. ఈపీఎఫ్ డేటాలోకి కొత్తగా వచ్చిన వారిని, బయటకు వెళ్లినవారిని పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా చేరిన వారి సంఖ్య 10 లక్షలు ఉంది.
ఈఎస్ఐ స్కీం, ఈపీఎఫ్ స్కీం
ఈఎస్ఐ స్కీం కింద కవరేజీకి ప్రస్తుతం ఉన్న వేతన పరిమితి నెలకు రూ.21,000. వైకల్యం ఉన్నవారికి రూ.25,000. పదిమంది, అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఇక, ఈపీఎఫ్ తప్పనిసరి పొదుపు పథకం. ఇది 20 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉంటే సంస్థకు వర్తిస్తుంది. పేతన సీలింగ్ రూ.15,000.
ఎక్కువ మంది వర్కర్స్ను ఈ స్కీం కిందకు తీసుకు వచ్చేలా
ఈఎస్ఐ స్కీం కింద ఎక్కువమంది వర్కర్స్ను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అరుణాచల్ ప్రదేశ్కు విస్తరించింది. అరుణాచల్ ప్రదేశ్లోని ఉద్యోగులు నవంబర్ 1, 2020 నుండి ఈ పథకం ప్రయోజనం పొందుతారు. ఈఎస్ఐ స్కీం దాదాపు 3.49 కోట్ల కుటుంబాలకు, 13.56 కోట్ల మంది లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు అందిస్తోంది.