మూడు దశాబ్దాల తర్వాత భారత్ నుంచి చైనా బియ్యం దిగుమతులు: ఎందుకంటే..?
న్యూఢిల్లీ/బీజింగ్: సుమారు మూడు దశాబ్దాల తర్వాత చైనా.. భారతదేశం నుంచి బియ్యం దిగుమతులు చేసుకుంటోంది. ఆ దేశంలో బియ్యం పంపిణీ తక్కువగా ఉండటంతో మనదేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడంతో మనదేశం నుంచే బియ్యం దిగుమతులు చేసుకుంటోంది.
ఈ మేరకు భారత వ్యాపారవర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు కాగా, చైనా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. బీజింగ్ మనదేశం నుంచి ఏడాదికి 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. అయితే, నాణ్యత సరిగా ఉండటం లేదని మరికొంత బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదు.
సరిహద్దులో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా మనదేశం నుంచి భారీ ఎత్తున బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం. చైనా మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత బియ్యాన్ని కొనుగోలు చేసిందని, భారత పంట నాణ్యత చూసిన తర్వాత వచ్చే ఏడాది ఈ కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు.
భారతీయ వ్యాపారులు డిసెంబర్-ఫిబ్రవరిలో 100,000 టన్నుల విరిగిన బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సరుకు టన్నుకు 300 డాలర్లు.
చైనా సాంప్రదాయ సరఫరాదారులైన థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్థాన్ ఎగుమతుల కోసం పరిమితమైన మిగులు సరఫరాను కలిగి ఉన్నాయి. భారతీయ ధరలతో పోలిస్తే టన్నుకు కనీసం $ 30 ఎక్కువ కోట్ చేస్తున్నాయని భారత బియ్యం వాణిజ్య అధికారులు తెలిపారు.