ముఖేష్ అంబానీ కంటే వెనుకబడిన జుకర్బర్గ్, ఫేస్బుక్ స్టాక్స్ భారీ పతనం
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్కు భారీ షాక్. ప్రపంచ మార్కెట్ చరిత్రలో ఎన్నడూలేనంతస్థాయిలో కంపెనీ మార్కెట్ వ్యాల్యూ భారీగా కుంగిపోయింది. తదనుగుణంగా జుకర్బర్గ్ సంపద కూడా కరిగిపోయింది. అమెరికాలో గురువారం మార్కెట్ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ షేర్లు 25 శాతం మేర కుప్పకూలాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 200 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. మన కరెన్సీలో ఇది రూ.15 లక్షల కోట్ల వరకు ఉంటుంది. జుకర్ బర్గ్ సంపద 2.2 లక్షల కోట్లు హరించుకుపోయింది.
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా క్వార్టర్ ఫలితాలు నిరాశపరిచాయి. కంపెనీ షేర్ వ్యాల్యూ గత రెండు రోజుల్లో భారీగా కుంగిపోయింది. గురువారం ఏకంగా 26.39 శాతం పడిపోయి నాస్డాక్లో 237 డాలర్లకు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 200 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ 661.39 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ సంపద గురువారం ఒక్కరోజే 29.7 బిలియన్ డాలర్లు లేదా 2.2 లక్షల కోట్లు తగ్గింది.
ప్రస్తుతం 84.8 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్బర్గ్ 12వ స్థానానికి పడిపోయారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం భారత కుబేరులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కూడా జుకర్ బర్గ్ కంటే ముందు ఉండటం గమనార్హం. గతంలో టెస్లా అధినేత తన కంపెనీ షేర్లలో పది శాతం విక్రయించడంతో ఎలాన్ మస్క్ సంపద 35 బిలియన్ డాలర్లు క్షీణించింది.