Flight Charges: వామ్మో.. ఆ రూట్లలో ఫ్లైట్ ఛార్జీలు చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
Flight Charges: బడ్జెట్ క్యారియర్ గో ఫస్ట్ మే 12 వరకు అన్ని విమానాలను నిలిపివేయడం వల్ల ఎయిర్లైన్స్ రూట్లలో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా NCLTలో ఎయిర్లైన్స్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ విమాన ఛార్జీల పెరుగుదల చాలా కాలం పాటు కొనసాగుతుందని నిపుణులు, పరిశ్రమలోని వ్యక్తులు భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత విమానయాన రంగంలో గో ఫస్ట్ మెుత్తం మార్కెట్ వాటా 6.9 శాతంగా ఉంది. ఇక మిగతావాటి గురించి చూస్తే మెుదటి స్థానంలో ఇండిగో ఉండగా.. ఆ తర్వాత ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, విస్తారాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. గో ఫస్ట్ వెబ్ సైట్ వివరాల ప్రకారం 53 విమానాలను కలిగి ఉంది. 34 గమ్యస్థానాలకు 200 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది.
ప్రస్తుతం గో ఫస్ట్ తన సేవలను నిర్వహణ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో కంపెనీ నిలిపివేసిన రూట్లలో ఛార్జీలు భారీగా పెరిగాయి. వివరాల్లోకి వెళితే మే 3 నాటికి ఢిల్లీ-ముంబై మార్గంలో విమాన ఛార్జీలు 37 శాతానికి పైగా పెరిగాయి. అలాగే అనేక ఇతర మార్గాల్లో 4-6 రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. ఇవే పరిస్థితులు మరిన్ని మార్గాల్లో వస్తాయని ప్రయాణికులు భయపడుతున్నారు.
మే 5 నాటికి అందుబాటులో ఉన్న వివరాలను గమనిస్తే.. ఢిల్లీ-లేహ్ మార్గం సాధారణ ధర రూ.4,772 పెరిగి ఒక్కసారిగా రూ.26,819కి పెరిగింది. అలాగే చండీగఢ్-శ్రీనగర్ మార్గంలో ప్రయాణ ఛార్జీ ఏకంగా రూ.4,047 నుంచి రూ.24,418కి చేరుకున్నాయి. అలాగే మే 6న శ్రీనగర్-చండీగఢ్ మార్గంలో విమాన ఛార్జీ రూ.26,148కి చేరుకుంది. ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీతేంద్ర భార్గవ్ ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అన్ని ఎయిర్లైన్స్లో అధిక ఆక్యుపెన్సీ అని పేర్కొన్నారు.