ఇది మంచి పద్ధతి కాదు, WTO రూల్స్కు విరుద్ధం: 59 యాప్స్ నిషేధంపై చైనా వార్నింగ్
బీజింగ్: సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు ధీటుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించింది. భద్రతా చర్యల కారణంతో 59 చైనా యాప్స్ను నిషేధించింది. టిక్ టాక్, హెలో, షేరిట్ వంటి బహుళప్రాచుర్యం పొందిన యాప్స్పై ఉక్కుపాదం మోపింది. ఈ చర్యతో కేవలం బైట్ డ్యాన్స్కే రూ.45వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని చైనా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని యాప్స్ నష్టం రూ.60వేల కోట్ల నుండి రూ.70వేల కోట్ల వరకు ఉండవచ్చు. చైనా యాప్స్ నిషేధంపై బీజింగ్ మరోసారి స్పందించింది.
భారత్ దెబ్బ మామూలుగా లేదు, ఆ ఒక్క చైనా కంపెనీకే రూ.45,000 కోట్ల నష్టం
నిబంధనలకు విరుద్ధం.. అన్ని చర్యలు తీసుకుంటాం
తమ దేశానికి చెందిన సంస్థల యాప్స్ను బ్లాక్ చేయడం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు విరుద్ధమని చైనా చెబుతోంది. ఇలా నిషేధించడం ద్వైపాక్షిక సహకారానికి మంచిది కాదని, అలాగే భారత ప్రయోజనాలకు కూడా హానికలిగిస్తుందని, దేశ సరిహద్దుల్లో శాంతిని కొనసాగించేందుకు ఇరు దేశాలు కలిసి పని చేయాలని చైనా తెలిపింది. భారత్లో చైనా సంస్థల వ్యాపార హక్కులను కాపాడేందుకు బీజింగ్ అన్ని చర్యలు తీసుకుంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు.
తాజాగా మరో దెబ్బ
రోడ్ల నిర్మాణంలోని చైనా కంపెనీలను తీసుకునేది లేదని ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తాజాగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా లేదా పాకిస్తాన్ నుండి పవర్ ఎక్విప్మెంట్స్ దిగుమతి చేసుకునేది లేదని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ శుక్రవారం తెలిపారు. గ్రిడ్ వైఫల్యాన్ని ప్రేరేపించే మాల్వేర్ ఆందోళనల కారణంగా, అన్ని పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్ ఏటా రూ.71 వేల కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలు, ఇతర సామాగ్రిని దిగుమతి చేసుకుంటోంది. ఇందులో చైనా వాటా రూ.21 వేల కోట్లకు పైగా ఉంది. పాకిస్తాన్ నుండి కూడా దిగుమతులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల నుంచి విద్యుత్ పరికరాలను కొనుగోళ్లను నియంత్రించాలని, వీలైతే నిషేధించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాల విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులకు లేఖ రాస్తామన్నారు.
మోడీ టూర్
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు లడక్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ చోటు చేసుకొని, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప్రధాని ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. లడక్లోని నిము ప్రాంతంలో సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉన్న నిము కఠినమైన భూభాగాల్లో ఒకటి. ఈ అంశంపై కూడా చైనా స్పందిస్తూ.. ఇరుదేశాలు ఉద్రిక్తతలు పెంచుకునేలా నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొంది. అయితే భారత్ దెబ్బ మీద దెబ్బ చైనా ఒకింత తగ్గినట్లుగా కనిపిస్తోంది. చైనా సంస్థల ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు తోడు చైనా వైఖరికి నిరసనగా అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలను ఒక్కటి చేస్తోంది భారత్. దీంతో చైనా ఒకింత వెనుకడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.