పక్క రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడి: అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ: అక్కడే ఏపీ సర్కార్ ఫెయిల్
భువనేశ్వర్: ఏపీకి పొరుగునే ఉన్న ఒడిశా.. నక్కతోక తొక్కింది. కళ్లు చెదిరి పెట్టుబడిని సాధించింది. ఏపీ సహా ఏ రాష్ట్రం కూడా ఊహించని మొత్తాన్ని పెట్టుబడిగా సాధించింది. ఈ పెట్టుబడి పెట్టేది కూడా మరెవరో కాదు.. ఉక్కు తయారీ రంగాన్ని శాసిస్తోన్న లక్ష్మీ మిట్టల్. లండన్లో స్థిరపడిన ఈ శ్రీమంతుడు.. ఒడిశాలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పబోతోన్నట్లు ప్రకటించారు.
లక్ష కోట్ల పెట్టుబడితో..
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ పేరుతో ఇది ఏర్పాటు కానుంది. తీర ప్రాంత నగరం కేంద్రపారాలోని మహాకలపాడ బ్లాక్లో దీన్ని నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ స్టీల్ ప్లాంట్ను నెలకొల్పడానికి ఆర్సెలార్ మిట్టల్ పెట్టుబడిగా పెట్టనున్న మొత్తం 1.02 లక్షల కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం 24 మిలియన్ టన్నుల మేర ఉక్కును తయారు చేస్తామని ఆర్సెలార్ స్టీల్స్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ తెలిపారు.
ఆర్సెలార్ మిట్టల్ స్టీల్స్..
దేశంలోనే అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీగా దీన్ని రూపొందించడానికి ఆర్సెలార్ మిట్టల్ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ప్రతి సంవత్సరం 24 మిలియన్ టన్నుల మేర స్టీల్ను ఉత్పత్తి చేయడం, దాన్ని ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్ట్.. ఇలా అన్ని రకాల కార్యకలాపాలు ఒకేచోట కొనసాగేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తామని తెలిపింది. రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ప్లాంట్ వల్ల 16,000 మందికి ప్రత్యక్షంగా..కనీసం లక్షమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఒడిశా ప్రభుత్వం అంచనా వేసింది.
ఏడేళ్లల్లో..
దశలవారీగా ఏడు సంవత్సరాల వ్యవధిలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించేలా ఆర్సెలార్ మిట్టల్ యాజమాన్యం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎక్విప్మెంట్ తయారీ రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఇందులో స్టేక్ హోల్డర్స్గా ఉండనున్నాయి. దీనికి అనుగుణంగా- డౌన్స్ట్రీమ్ ఇండస్ట్రీ పార్క్ను నెలకొల్పుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఇండస్ట్రియల్ పార్క్ను అందుబాటులోకి తీసుకుని వస్తుందని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది.
అనుబంధంగా సిమెంట్ ఫ్యాక్టరీ..
ఓ భారీ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఇదే స్టీల్ ప్లాంట్కు అనుగుణంగా నెలకొల్పనుంది ఆర్సెలార్ మిట్టల్ యాజమాన్యం. ప్రతి సంవత్సరం 18.75 మిలియన్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏడాది వ్యవధిలో ఒడిశా సాధించిన అతిపెద్ద పెట్టుబడి ఇది. ఇప్పటిదాకా సాధించిన పెట్టుబడుల విలువ 2.7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. సుమారు 1.6 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించే పెట్టుబడి ఇది. ఒడిశా.. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూస్డ్ స్టేట్. 2030 నాటికి ఈ ఒక్క రాష్ట్రం నుంచే 100 మిలియన్ టన్నుల మేర స్టీల్ ఉత్పత్తి అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఏపీ సర్కార్ ఫెయిల్..
ఈ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని సాధించడం అంటే మాటలు కాదు. తీరప్రాంతం, లాజిస్టిక్స్ సహా ఇంత భారీఎత్తున స్టీల్ ప్లాంట్ను నెలకొల్పడానికి అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆర్సెలార్ మిట్టల్ యాజమాన్యం ఏపీ వైపు మొగ్గ చూపలేదు. వనరులు విస్తారంగా ఉన్న ఒడిశాలోనే పెట్టుబడిని పెట్టడానికి ఆసక్తి చూపింది.