ఆపిల్ కీలక నిర్ణయం: ఇండియాలో iPhone 12 ఉత్పత్తి, బెంగళూరులో 10,000 ఉద్యోగాలు
ఆపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి మేడిన్ ఇండియా ఐఫోన్ 12ను అందుబాటులోకి తీసుకు రానుందని వార్తలు వచ్చాయి. ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విస్ట్రోన్ (తైవాన్ కంపెనీ) ఇప్పటికే బెంగళూరు సమీపంలో ఐఫోన్ 12 ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా చాలా కంపెనీలు భారత్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా భారత్లో తయారీ కోసం ప్రోత్సాహం ఇస్తోంది. చైనాతో పాటు వివిధ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఉత్పత్తిదారులు దాదాపు రెండు డజన్లు భారత్ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 12 ఉత్పత్తి ప్రక్రియను తైవాన్కు చెందిన విస్ట్రోన్ ఇప్పటికే ప్రారంభించింది.
స్టాక్ ఇన్వెస్టర్లూ! జాగ్రత్త.. ఎకానమీతో సంబంధం లేకుండా పెరుగుదల: ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
భారీ పెట్టుబడి.. 10వేల ఉద్యోగాలు
మేడిన్ ఇండియా ఉత్పత్తి కోసం ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ విస్ట్రోన్ రూ.2,900 కోట్ల భారీ పెట్టుబడులు పెడుతోందని, అలాగే నియామక ప్రక్రియను కూడా ప్రారంభించిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్లాంటులో ఇప్పటికే వెయ్యి మంది వరకు ఉద్యోగులను తీసుకున్నది. విడతలవారీగా అవసరాన్ని బట్టి మొత్తం 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పెట్టుబడుల్లో సగం వరకు ఇప్పటికే వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే అక్టోబర్ నాటికి పూర్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మేడిన్ ఇండియాతో పాటు ఆపిల్ మిడ్ టర్మ్ లక్ష్యం చేరేందుకు విస్ట్రోన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇండియాకు విస్తరిస్తోంది.
ఇంటర్వ్యూలో.. పన్నులు తగ్గి, ఉద్యోగాలు వచ్చి..
అర్హత కలిగిన వారికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్స్కు త్వరలోనే మరిన్ని అవకాశాలు రానున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 12 కాంపొనెట్స్ ట్రయల్ ప్రొడక్షన్ చేపట్టిన విస్ట్రోన్ సెప్టెంబర్ నుంచి కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. వీటి ఉత్పత్తి స్థానికంగా ఉండటంతో దిగుమతి పన్నులు 22 శాతం తగ్గడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
బెంగళూరు సమీపంలో ప్లాంట్
కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసాపురలో గల ప్లాంటులో ఈ మేరకు ఐఫోన్ 12 కాంపోనెట్స్ ఉత్పత్తి మొదలైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విస్ట్రోన్ కంపెనీ దశలవారీగా పదివేల మంది ఉద్యోగాలు కల్పించే యోచనలో ఉంది. ఇది బెంగళూరుకు సమీపంలో ఉంది. తమ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 12 సెప్టెంబర్ తర్వాత రానుందని ఇటీవలే ఈ అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే. iPhone 12 (5G) ధర రూ.70,000గా ఉంటుందని అంచనా.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా..
ఇప్పటికే మన దేశంలో ఐఫోన్ 6S, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11 ఉత్పత్తి చేసిన ఆపిల్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్ 12ను ఇక్కడే తయారు చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. బెంగళూరు ఇప్పటికే ఉన్న ప్లాంటులో iPhone SE (2020) తయారు చేస్తుంది. ఈ సెకండ్ జనరేషన్ ఎస్ఈ హ్యాండ్సెట్స్ ఏప్రిల్ నెలలో లాంచ్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న తక్కువ ధర ఐఫోన్ ఇది. ఖరీదు రూ.42,500. ఏప్రిల్-జూన్ నెలలో రూ.40,000కు పైగా ఖరీదైన మొబైల్ సేల్స్లో iPhone SE టాప్ 5లో ఉంది.