కరోనా వ్యాక్సినేషన్పై యాపిల్ సంచలన నిర్ణయం: వారందరి కోసం..!
కాలిఫోర్నియా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ఓ మహాయజ్ఙమే చేస్తోన్నాయి. కరోనా రూపుమాపడానికి అవసరమైన వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చిన తరువాత.. దాదాపు అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కొన్ని పేద దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది. భారత్ సహా అన్ని దేశాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ప్రత్యేకించి- అమెరికాలో.
బంగారం కొనడానికి ఇదే బంగారం లాంటి అవకాశం: హైదరాబాద్, విజయవాడల్లో రేట్లివీ
అమెరికాపై కరోనా పంజా
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. ఆ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్యలో కూడా అమెరికా అగ్రరాజ్యంగానే కొనసాగుతోంది. 5,85,075 వేల మంది కరోనా బారిన పడి కన్నుమూశారక్కడ. 3,27,35,704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,24,378,873 మంది రికవరీ అయ్యారు. యాక్టివ్ కేసులు 68,54,582గా నమోదయ్యాయి. అత్యధిక మరణాలు కాలిఫోర్నియాలో నమోదయ్యాయి. ఈ ఒక్క సిటీలోనే 61,402 మంది మరణించారు.
సిలికాన్ సిటీలోనే
ఈ నగరంలో 37,30,477 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 19,82,240 పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. 16,86,835 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రతి మిలియన్ జనాభాకూ 94,413 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు కాలిఫోర్నియాలో. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జో బిడెన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన తొలి 100 రోజుల పరిపాలన పూర్తయ్యే సరికి 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
యాపిల్ ఉద్యోగులకు సంస్థ కార్యాలయాల్లోనే
జో బిడెన్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి ఆ దేశానికి చెందిన బహుళజాతి సంస్థలు కూడా కలిసి వస్తున్నాయి. టార్గెట్ను చేరుకోవడానికి ప్రభుత్వానికి తమ వంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం కొనసాగుతున్నది కూడా కాలిఫోర్నియాలోనే. ఈ పరిస్థితుల మధ్య తమ సంస్థ ఉద్యోగులందరికీ కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.
ఫస్ట్ ఐటీ కంపెనీగా..
దీనికోసం డ్రగ్స్టోర్ చెయిన్ కంపెనీ వాల్గ్రీన్స్ బూట్స్ అలయన్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాల్గ్రీన్స్ బూట్స్ కంపెనీ వెబ్సైట్ ద్వారా యాపిల్ కంపెనీ ఉద్యోగులు వ్యాక్సిన్ కోసం తమ పేరును రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. తమ సంస్థ ఉద్యోగులకు కార్యాలయాల్లోనే వ్యాక్సినే్ వేయించేలా చర్యలను తీసుకున్న తొలి కంపెనీ ఇదే.
బ్యాంకింగ్ సెక్టార్ కూడా..
సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న బహుళ జాతి కంపెనీలేవీ కూడా ఇప్పటిదాకా ఇలాంటి చర్యలను చేపట్టలేదు. బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇప్పటికే ఇలాంటి చర్యలు ఆరంభం అయ్యాయి. డెయుట్స్చె బ్యాంక్ ఏజీ ఇప్పటికే తమ ఉద్యోగులకు సంస్థ కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ వేయించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ బిజినెస్ సంస్థ అమెజాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. తమ ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ సౌకర్యాన్ని కల్పించింది.