హైదరాబాద్ అపోలోలో స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్
భారత దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్-అపోలో హాస్పిటల్స్ కలిసి వ్యాక్సినేషన్ డ్రైవ్ పైన ప్రకటన చేశాయి. ఇందుకు సంబంధించి పైలెట్ ప్రాజెక్టును డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్లో సోమవారం నుండి ప్రారంభించింది. మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభిస్తోంది.
ప్రయివేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి తమ 60 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. స్పుత్నిక్-వి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీటిని పరీక్షించేందుకు తొలి దశలో డాక్టర్ రెడ్డీస్కు చెందిన 50,000 ఉద్యోగులు, వారి కుటుంబాలకు వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.
స్పుత్నిక్ వి వ్యాక్సీన్ డోస్ ధర అన్ని ఖర్చులతో కలిపి రూ.1,200 నుండి రూ.1,250 వరకు ఉండవచ్చునని చెప్పారు. కాగా, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ఉత్పత్తి చేయబోతున్నట్లు శిల్పా మెడికేర్ తెలిపింది. ఇందుకు డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ పరిమిత కాలపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. స్పుత్నిక్ విని భారత్లో ఉత్పత్తి, పంపిణీ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.