స్టీల్ ప్లాంట్కు రూ.15వేలకోట్లు: కంపెనీలు రాకపోయినా జగన్ ధైర్యం! కేంద్రానికి థ్యాంక్స్
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం (డిసెంబర్ 23) కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. విభజన తర్వాత ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే, హైదరాబాద్ వంటి కీలక నగరం దూరం కావడంతో ఉద్యోగలేమి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం కడప స్టీల్ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించింది.
రైతులకు జగన్ ప్రభుత్వం 100% ఆఫర్! మీరు ప్రీమియం చెల్లించాల్సిన అవసరంలేదు
రాయలసీమ ముఖచిత్రం మార్చేందుకు..
కడప ఉక్కు కర్మాగారానికి జగన్ శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. స్టీల్ ఫ్యాక్టరీ కట్టడం రాష్ట్ర ప్రభుత్వం పని కాదని, అయిదేళ్లు చూసినా ఇది రాకపోవడంతో రాయలసీమ ముఖ చిత్రం మార్చేందుకు, ఇక్కడి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందడుకు వేయవలసి వచ్చిందని చెప్పారు. తాము ఆరు నెలలు తిరక్కుండానే ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పారు. ఈ ప్యాక్టరీ జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉంది.
రూ.15వేల కోట్లు, 25వేల ఉద్యోగాలు
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ సమయం, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత పెట్టుబడి అవసరమవుతుందనే విషయాలు కూడా జగన్ ప్రస్తావించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి పెట్టుబడి అంచనా రూ.15వేల కోట్లు. ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముడిసరుకు ఎలా? మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కడప స్టీల్ ఫ్యాక్టరీకి ముడి సరకు విషయంలో NMDCతో ఒప్పందానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ కారణంగా జగన్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ పరిశ్రమకు ముడిసరుకు అందించేందుకు NMDC ఒప్పందానికి ఓకే చెప్పింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.
కడప స్టీల్ పరిశ్రమ దేశానికి ఉపయోగం...
2030 నాటికి దేశ అవసరాలు తీరాలంటే 3 కోట్ల టన్నుల ఉక్కు అవసరం. అందు వల్ల కడపలో 30 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే ఉపయోగకరం. ఇది దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
పెట్టుబడులు రాకపోయినా...
ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ప్రభుత్వం పెద్ద వాళ్లతో పెట్టుబడులపై చర్చిస్తోంది. అవి ఫలిస్తే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారని భావిస్తున్నారు. అయితే ఎవరూ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జగన్ ప్రకటించారు. ఓ వైపు దీనిని ప్రారంభిస్తూనే మరోవైపు పెద్ద కంపెనీలతో చర్చిస్తోంది. అయితే ఆ చర్చలు కొలిక్కి వచ్చే వరకు లేదా ఒకవేళ మధ్యలో అవి నిలిచిపోయినా నిర్మాణం ఆగవద్దని ప్రభుత్వమే ప్రారంభిస్తోంది.
సీమలో పారిశ్రామిక అభివృద్ధి
ఏపీకి ఉక్కు పరిశ్రమ కావాలని 1960లో ఉద్యమం మొదలైంది. 1966లో ఉద్యమంలో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు ఉద్యోగులు బలిదానం చేశారని జగన్ గుర్తు చేశారు. దీంతో అప్పుడు ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభమైంది. కడప ఉక్కు పరిశ్రమలతో సీమ బతుకులు మారుతాయని జగన్ చెప్పారు. వేలాదిమందికి ఉద్యోగాలు రావడంతో పాటు అనుబంధ యూనిట్లు వస్తాయన్నారు. ఇప్పటికే అనంతపురంలో కార్ల పరిశ్రమ ఉంది. వీటి ద్వారా ఉద్యోగాలలో కొత్త శకానికి నాంది పలుకుతున్నామని చెప్పారు. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.