HUDCO నుంచి రూ.5,000 కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం, ఎందుకో తెలుసా?
విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (HUDCO) నుండి రూ.5,000 కోట్లను రుణంగా తీసుకోనున్నదని తెలుస్తోంది. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేదలకు పంచేందుకుగాను 12,000 ఎకరాలు కొనుగోలు చేసేందుకు దీనిని తీసుకోనుంది. రాష్ట్రంలోని 25 లక్షలమంది అర్హులకు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం రోజున ఇళ్లు హౌసింగ్ సైట్స్, హౌసింగ్ యూనిట్స్ అందించాలని నిర్ణయించింది.
బడ్జెట్ రోజు మార్కెట్లు ఎందుకు పతనమయ్యాయంటే: నిర్మల
40,000 ఎకరాలు అవసరం..
భూమిలేని అర్హులకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,000 ఎకరాలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. 27,000 ప్రభుత్వ భూమిని గుర్తించారు. మరో 15,000 ఎకరాల భూమిని ప్రయివేటుగా కొనుగోలు చేయాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో పరిశ్రమల కోసం భూమిని కేటాయించారు. అభివృద్ధి జరగని ఆ పారిశ్రామిక భూములను కూడా ఇళ్ల కోసం కేటాయించారు.
రూ.5000 ఇచ్చేందుకు హడ్కో ఓకే
12,000 ఎకరాల స్థలాన్ని రైతులు, లాండ్ లార్డ్స్ నుంచి కొనుగోలు చేస్తామని, మిగతా 3,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సేకరించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు రూ.5,000 కోట్లు అవసరమని, ఈ మొత్తాన్ని హడ్కో నుంచి తీసుకుంటామని, ఇందుకు ఆ సంస్థ కూడా అంగీకరించిందని రెవెన్యూ డిపార్టుమెంట్ అధికారులు చెబుతున్నారు.
ప్రాథమికంగా రూ.10వేల కోట్లు..
ప్రాథమికంగా 19,000 ఎకరాలు అవసరమని, వీటికి రూ.10,000 కోట్లు అవసరమని అంచనా చేశామని అంటున్నారు. ఈ మొత్తాన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ను సంప్రదించింది. దీనిని హౌసింగ్ ప్రాజెక్టుగా గుర్తించాలని, హౌసింగ్ సైట్ డిస్ట్రిబ్యూషన్గా గుర్తించవద్దని కోరింది.
హడ్కో సిద్ధం..
కానీ అంతలోనే మరింత ప్రభుత్వ భూమిని గుర్తించామని, దీంతో కొనుగోలు ఆర్థిక భారం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు హడ్కో రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
భూములపై రగడ
ఇదిలా ఉండగా, హిందూ దేవాలయాలు, దేవాదాయకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పంపిణీ చేసే ప్రయత్నాలు చేయడం విడ్డూరమని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. దేవాదాయ శాఖకు చెందిన భూములను పంపిణీ చేసేందుకు ఎలా తీసుకుంటారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. అయితే దేవాదాయ భూములు తాము తీసుకోవడం లేదని, ఇది అబద్దపు ప్రచారమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.