అమరావతికి రూ.1 లక్షకోట్లు: ప్రభుత్వానికి భారంగా రాజధాని.. జగన్ రివర్స్ ప్లాన్!
అమరావతి: ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ మ్యాప్ విడుదల చేసింది. తాజాగా, రాష్ట్ర రాజధానిలో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను సోమవారం ఆదేశించారు. రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనులను కొనసాగించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. ఆర్భాటాలకు వెళ్లకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకొని పనులు చేపట్టాలన్నారు. పరిమాణం, అంచనా వ్యయం తగ్గించాలన్నారు..
ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు, ఆదాయం ఎంత ఉండాలంటే
పనులు.. ఖర్చులపై సమీక్ష
సీఆర్డీఐ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, బిల్డింగ్స్ నిర్మాణంలో అనవసర ఆర్భాటాలకు వెళ్లకుండా పనులన్నీ పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగినట్లు ప్రాధాన్యతా క్రమంలో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఐ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే అంశాలపై జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
అందుకే అనవసర ఖర్చులు వద్దు
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అనవసర ఖర్చులకు వెళ్లకుండా రాజధాని నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని జగన్ సూచించారు. మొదట త్వరగా పూర్తయ్యే పనులపై దృష్టి సారించాలన్నారు. వీటికి అవసరమైన నిధులు సమకూరుస్తామన్నారు. 75 శాతానికి పైగా పూర్తయిన ప్రాజెక్టులను ముందు వరుసలో పూర్తి చేయాలన్నారు. కొన్ని నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్కు వెళ్తే ఖజానాపై భారం తగ్గవచ్చునని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఆర్థిక భారం ఎఫెక్ట్... అనవసర ప్రాజెక్టులు వద్దు..
అనవసర ప్రాజెక్టులను తొలగించాలని జగన్ సూచించారు. ప్రాజెక్టులను సాధ్యమైనంతగా కుదించడం ద్వారా తక్కువ నిధులతోనే పూర్తి చేయడానికి అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో రోడ్ల డిజైన్లలో పొరపాటు లేకుండా చూసుకోవాలన్నారు. రోడ్ల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్ వంటి అంశాలపై ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు తీసుకోవాలన్నారు.
రాజధాని రైతులకు గుడ్ న్యూస్
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి పరిచి ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గత ప్రభుత్వం చేపట్టినంత భారీ స్థాయిలో ప్రాజెక్టులను నిర్మించలేమన్నారు.
రాజధాని నిర్మాణం కోసం...
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.1.09 లక్షల కోట్ల ఖర్చవుతాయని గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో రూ.44వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఇలా మొదలైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రాజధానిలో ప్రస్తుతం 1.5 లక్షల జనాభా ఉండగా, 2050 నాటికి 35 లక్షల జనాభా ఉంటుందనే ఆలోచనతో ప్రణాళిక వేశారు. అయితే ఇంత భారీ రోడ్లు, నిర్మాణాలు ఇప్పుడు అవసరం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు తగ్గింపులో భాగంగా రాజధానిని కేవలం బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైన మేరకే రోడ్లు నిర్మించాలని, 8, 6 లైన్ల రోడ్ల వెడల్పు తగ్గించాలని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు నిర్మించుకునేందుకు వీలుగా ఖాళీ ప్రదేశం వదిలి పెట్టాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంతాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. ఎల్పీఎస్ లే అవుట్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ.17వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలించారు. ఈ విషయాన్ని సీఎంకు అధికారులు వివరించారు. అయితే తక్షణ అవసరాల మేరకు పనులు చేపట్టాలని ఆదేశించారు. వివిధ పనుల వ్యయం తగ్గించుకొని, రీటెండరింగ్ లేదా రివర్స్ టెండరింగ్కు వెళ్లాలన్నారు.
రూ.15 వేల కోట్లు అవసరం
ఎంత తగ్గించి, నిర్మాణాలు చేపట్టినా రూ.15వేల కోట్లు ఖర్చు అవుతాయని జగన్కు అధికారులు వివరించారు. ఏడాదికి రూ.5వేల చొప్పున మూడేళ్లలో రూ.15వేల కోట్లు సమకూర్చాలని కోరారు. ప్రభుత్వం ఆ నిధులు గ్రాంటుగా ఇవ్వాలని, బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని కోరారు.
హ్యాపీనెస్ట్.. హ్యాపీ
ఇదిలా ఉండగా, శాఖమూరు పార్క్ పక్క సీఆర్డీఏ తలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1200 ప్లాట్లు నిర్మించి ప్రజలకు విక్రయించేందుకు సీఆర్డీఏ ఈ ప్రాజెక్టును తలపెట్టింది. రెండు దశల్లో బుకింగ్స్ నిర్వహించగా ప్లాట్లన్నీ బుక్ అయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. అయితే ఈ ప్రాజెక్టును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.