మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ, సీఈవోగా అనీశ్ షా, ఏప్రిల్ 2 నుంచి విధుల్లోకి
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనీశ్ షా బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 2, 2021 నుంచి ఈయన నియామకం అమల్లోకి రానుందని సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు ఆయన సంస్థలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ, సీఈవోగా ఉన్న పవన్ గోయెంకా ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు. గత నవంబర్లోనే ఆనంద్ మహీంద్రా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవిలోకి మారిన తర్వాత మహీంద్రా గ్రూప్ చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయి ప్రొఫెషనల్ ఎండీ, సీఈవోగా అనీశ్ షా బాధ్యతలు స్వీకరించనున్నారని సంస్థ పేర్కొంది. కాగా, అనీశ్ షా మహీంద్రాలో 2015లో చేరారు. అంతకుముందు జీఈ క్యాపిటల్ లో ప్రెసిడెంట్, సీఈవోగా14ఏళ్లు పనిచేశారు.
గత 75 ఏళ్లుగా సరైన ప్రమాణాలతో, ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుండటంతోనే గ్రూప్ ఎప్పుడూ విజయవంతంగా కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఎంఅండ్ఎం కొత్త ఎండీ, సీఈవోగా అనీశ్ షా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు.