అమరావతిలో కీలక 'ప్రాజెక్టు' రద్దు, సింగపూర్కు జగన్ ప్రభుత్వం గుడ్బై!! కారణమిదే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కథ ముగిసింది. గత ప్రభుత్వం హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. అమరావతిలో ఎంపిక చేసిన ప్రాంతంలో 1691 ఎకరాల్లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్గా స్టార్టప్ ఏరియా ప్రాంతంగా అబివృద్ధి చేయాలని నిర్ణయించింది. సింగపూర్కు చెందిన సంస్థల కన్సార్టియంను స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్గా ఎంపిక చేసింది. దీనికి 2017 మే నెలలో శంకుస్థాపన జరిగింది.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
ప్రాజెక్టు ప్రారంభం కాలేదు.. రద్దు
ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తు, ఒప్పందాలు, ప్రత్యేక కంపెనీ ఏర్పాటు పూర్తయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది. కేవలం ఆ స్థలం చదును చేశారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టు పూర్తిగా రద్దయింది. వివిధ లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు ఇది రద్దయింది.
ఈ ప్రాజెక్టుతో లక్షలాదిమందికి ఉద్యోగాలు
అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల వేగవంతం, అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, పర్యాటక వసతుల అభివృద్ధి, ఐటీ, ఐటీఈఎస్ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, హోటల్స్, మాల్స్ వంటి నిర్మాణాలు చేపట్టడం సహా ఎన్నో ఉన్నాయి. 2.50 లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చేలా చేయడం కోసం ఇది పని చేయాలి. అలాగే, ఈ ప్రాంతం నుంచిజీఎస్డీపీకి రూ.1.15 లక్షల కోట్లు వచ్చేలా చూడాలని భావించాయి. అలాగే, ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి రూ.8వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లు సమకూరేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు కోసం...
ఈ ప్రాజెక్టు కోసం సింగపూర్ కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి సంయుక్తంగా ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. సింగపూర్ కన్సార్టియం... సింగపూర్-అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పేరుతో ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్, అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి ఓ సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. దీనిని ఏడీపీగా వ్యవహరించారు.
42-58 వాటా
ఏడీపీలో అమరావతి అభివృద్ధి సంస్థకు 42 శాతం, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్కు 58 శాతం వాటా ఉంటాయి. ఈ సంస్థలు రూ.222 కోట్లు, రూ.306 కోట్లు ప్రిన్సిపుల్ ఇన్వెస్ట్మెంట్ను ఏర్పాటు చేయాలి. అమరావతి అభివృద్ధఇ సంస్థ రూ.52 కోట్లు, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ దాదాపు రూ.72 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఆ డబ్బు ప్రస్తుతం ఉమ్మడి ఖాతాలో ఉంది.
ఇదీ ప్లాన్
1691 ఏకరాలను మూడు దశల్లో పదిహేనేళ్లలో అభివృద్ధి చేసి, మరో అయిదేళ్లలో మార్కెటింగ్, సేల్స్ పూర్తి చేయాలని నిర్ణయించాయి. భూమి యాజమాన్య హక్కులు సీఆర్డీఏ వద్ద ఉంటాయి. డెవలప్మెంట్, సేల్స్కు సంబంధించి అన్ని నిర్ణయాలు జరిగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం ప్రతినిధుల మధ్య చర్చల అనంతరం పరస్పర అంగీకారంతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అయిన ఖర్చుల్లో అమరావతి అభివృద్ధి సంస్థ వాటా రూ.7.90 కోట్లుగా నిర్ణయించారు. ఉమ్మడి ఖాతాలో రూ.124 కోట్లు ఉండగా, ఖర్చులు పోను ఎవరి డబ్బులు వారు తీసుకోంటున్నారు.
ఏపీకి ఆలోచన లేదా?
స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు ఆగిపోవడంపై సింగపూర్ వాణిజ్య సంబంధాల శాఖ ఇంచార్జ్ మంత్రి ఈశ్వరన్ స్పందించారు. ఈ ప్రాజెక్టును కొనసాగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని గుర్తించినట్లు చెప్పారు. ఈ ఒప్పందం రద్దయినా ఏపీ సహా భారత్లోని ఏ రాష్ట్రంలో అయినా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. మరోవైపు, ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని, ఇదే ప్రశ్నకు సింగపూర్ నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని అందుకే పరస్పర అంగీకారంతో రద్దు చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతిపై ఎక్కువగా దృష్టి సారించడం లేదనే వాదనలు ఉన్నాయి. కేవలం అమరావతి పైనే దృష్టి పెట్టకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతికి గత ప్రభుత్వంలో ఉన్నంత డిమాండ్ లేదనేది వాదన.