కృష్ణపట్నం పోర్ట్లో భారీ అదానీ గ్రూప్కు భారీ వాటా, జగన్ ప్రభుత్వం ఓకే
అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం లభించింది. ఇది మొత్తం రూ.13,572 కోట్ల డీల్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదం తెలిపిన దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఏపీ కేబినెట్ కూడా గురువారం ఓకే చేసింది. అదానీకి చెందిన కంపెనీలు ఇటీవల వరుసగా పలు ప్రాజెక్టులు దక్కించుకుంటున్నాయి. తాజాగా కృష్ణపట్నంను దక్కించుకుంది.
అదానీ అదుర్స్.. 5 ఏళ్లలోనే ప్రపంచ నెంబర్ 1
75 శాతం వాటా కేటాయింపు
కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (APSEZ)కు 75 శాతం వాటాను కేటాయించింది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ పోర్టు బాధ్యతలు ఇక నుండి అదానీ పోర్ట్స్ చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము ఎన్ఓసీ ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు.
జనవరిలోనే ప్రకటన
కృష్ణపట్నం పోర్టును అక్వైర్ చేసుకుంటున్నట్లు అదానీ పోర్ట్స్ జనవరి 2020లో తెలిపింది. ప్రస్తుతం ఇది హైదరాబాద్కు చెందిన సీవీఆర్ గ్రూప్ చేతిలో ఉంది. సీవీఆర్ గ్రూప్ నుండి తాము కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జూలై 22వ తేదీన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదం లభించింది. ఈ పోర్టును 2009లో 30 సంవత్సరాల లీజుకు హైదరాబాద్కు చెందిన సీవీఆర్ గ్రూప్కు కేటాయించారు. ఇందులో మెజార్టీ వాటా ఇప్పుడు అదానీ గ్రూప్ వశమైంది.
అదానీకి వరుస అవకాశాలు
రాజస్తాన్లోని పవర్ కంపెనీ, జీవీకే నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాలను అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు కూడా ఈ ఖాతాలో చేరింది. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద పోర్టు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో 74 శాతం వాటాను దక్కించుకుంది. మరో 6 ఎయిర్ పోర్ట్స్ నిర్వహణ కాంట్రాక్టులు కూడా పొందింది.