నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు: జగన్ అమ్మఒడికి.. 82 లక్షలమంది, రూ.6,500 కోట్లు
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (జనవరి 9) ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం అమ్మఒడిని ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు ప్రారంభించారు. అర్హులైన తల్లులను పాఠశాలలకు ఆహ్వానించి ఈ పథకాన్ని ప్రారంభించారు. పిల్లలను స్కూల్కు పంపించే పేద తల్లులకు ఈ కానుక అందుతుంది.
ఈ ఒక్కసారికి అమ్మఒడిపై జగన్ ప్రభుత్వం శుభవార్త! వారికి రీవెరిఫికేషన్
తల్లి పేరు మీద డబ్బులు
అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏడాదికి రూ.15,000 అందుతుంది. ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు.. వారి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం.
ఎంత కేటాయింపు, ఎంతమంది లబ్ధిదారులు...
అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబం వారికి ప్రయోజనం చేకూరుతుంది. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు బెనిఫిట్ కలుగుతుంది. 43 లక్షల మంది తల్లుల అకౌంట్లలో డబ్బులు పడతాయి.
ప్రతి జిల్లాలోను లక్షలాది మంది..
ఈ పథకం కింద లబ్ధి పొందే వారిలో దాదాపు ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది నుంచి మూడు లక్షలకు పైగా ఉన్నారు. 7,231 మంది అనాథ పిల్లలు లబ్ధి పొందుతున్నారు.
జాబితాలో పేరు లేకపోయినా...
జాబితాలో తల్లులు లేదా సంరక్షకుల పేర్లు లేకపోయినా ఆందోళన అవసరం లేదు. వారు సంబంధిత ధృవీకరణ పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల దృష్టికి తీసుకు వెళ్తే వారు పరిశీలించి అర్హులైతే అమ్మఒడి అందేలా చేస్తారు. సకాలంలో ధృవపత్రాలు అందచేయని పక్షంలో తమ పత్రాలను గ్రామ లేదా వార్డు సచివాలయాలు, ఎంఈవోల దృష్టికి తీసుకు వెళ్లాలని విద్యాశాఖ పేర్కొంది.
నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు బదలీ చేస్తున్నా...
గురువారం చిత్తూరు జిల్లాలో జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు బుధవారం ఆయన తల్లులకు లేఖలు రాశారు. అమ్మఒడి ఆర్థిక సాయం అందుకోనున్న తల్లులకు అభినందనలు. పేదింటి తల్లులు తమ బిడ్డల్ని చదివించుకునేందుకు పడుతున్న బాధలు పాదయాత్రలో చూశాను. అందుకే మేనిఫెస్టోలో అమ్మఒడి పెట్టి, ఇప్పుడు అమలు చేస్తున్నాం. నేరుగా మీ బ్యాంకు ఖాతాలో రూ.15వేలు బదలీ చేస్తున్నా. ఈ సొమ్ముతో మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ లాంటి 43 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు.