అవును... తప్పు చేశాం: ఆనంద్ మహీంద్రా ఒప్పుకోలు!
అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు, తప్పులు చేస్తాం. వాటి వల్ల ఇబ్బందులు పడతాం. అయితే, ఇవి అనుభవం లేని వారికి మాత్రమే పరిమితం కాదు. ఆయా రంగాల్లో అపార అనుభవం ఉన్న వారు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు. తర్వాత అయ్యోఎంత పనిచేశాము అనుకుంటూ తమ తప్పును తెలుసుకొని విచారం వ్యక్తం చేస్తారు. ఇలాంటి ఒక సంఘటనే ఆటోమొబైల్ రంగంలో ప్రఖ్యాత కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కు ఎదురయ్యింది. మహీంద్రా అంటేనే తొలుత ట్రాక్టర్లు గుర్తుకొస్తాయి. ఎందుకంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ల ఉత్పత్తి కంపెనీ మహీంద్రా నే కావటం మనకూ గర్వ కారణమే.
అలాగే ఈ కంపెనీ బొలెరో వంటి పికప్ వాహనాలు, భారీ ట్రక్కుక్కులు, ఎక్స్ యూ వి 500 వంటి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ తయారీ కి ప్రసిద్ధి. వీరితో పేరుతొ పాసెంజర్ కార్ల తయారీ లోకి కూడా విస్తరించింది. అయితే, దశాబ్ద కాలం క్రితం ఈ కంపెనీ తనకు అనుభవం లేని ద్విచక్ర వాహనాల తయారీ లోకి ప్రవేశించింది. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా ఘోరంగా విఫలమైంది. ఈ విషయాన్నే ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఐన ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆ రంగంలోకి ప్రవేశించటం తాము చేసిన తప్పేనని ఒప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది.
అమ్మకాలు లేవు.. అయినా ధరలు పెంచుతున్నారు.. ఎందుకంటే?
కైనెటిక్ తో ఎంట్రీ...
అప్పటి వరకు ట్రాక్టర్లు సహా పికప్ ట్రక్లు, ఎస్ యూ వి తదితర వాహనాలను తయారు చేసే మహీంద్రా గ్రూప్... 2008 జులై లో కైనెటిక్ మోటార్స్ ను కొనుగోలు చేసింది. దాంతో ఫ్రీడమ్ బైక్ లను మోజో అనే పేరుతొ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కానీ భారత్ ద్విచక్ర వాహనాల రంగంలో దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్, జపాన్ దిగ్గజం హోండా మోటార్స్, మరో భారత దిగ్గజం బజాజ్ మాత్రమే మార్కెట్ లీడర్లు. సుమారు 90% మార్కెట్ వాటాను ఈ మూడు కంపెనీలే శాసిస్తాయి. వీటి పోటీ ధాటికి మహీంద్రా గ్రూప్ తట్టుకోలేక పోయింది. అందుకే ద్విచక్ర వాహన తయారీ లోకి ప్రవేశించటం తాము చేసిన తప్పుగా మహీంద్రా గ్రూప్ గుర్తించింది.
కేవలం 4,000....
ఇండియన్ టూ వీలర్ మార్కెట్ పరిమాణం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ల లో ఒకటి. ఇక్క ఏటా సుమారు 2.1 కోట్ల ద్వి చక్ర వాహనాలు అమ్ముడవుతాయి. కానీ పైన చెప్పిన కారణాల వల్ల మహీంద్రా గ్రూప్ ఈ రంగంలో కనీస మార్కెట్ షేర్ ను కూడా సాధించలేక పోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా కేవలం 4,004 యూనిట్ల టూ వీలర్లను విక్రయించగలిగింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే కంపెనీ అమ్మకాలు ఏకంగా 73% పడిపోయాయి. అంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందొ అర్థమవుతుంది. ఈ విషయంలో కవాసకి మోటార్స్ మాత్రమే మహీంద్రా కంటే వెనుకబడి ఉంది. కవాసకి కేవలం 3,115 యూనిట్లను విక్రయించింది.
అందుకే ఫెయిల్ అయ్యాం...
ద్విచక్ర వాహనాల విభాగాలో పెట్టిన పెట్టుబడిని కాపిటల్ లాస్ గా పరిగణించిన మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఆ విభాగం విఫలం అవటాన్ని 'ప్రోడక్ట్ ఫైలురు గా అభివర్ణించారు. మా కలపై మాకు పూర్తి స్పష్టత ఉంది. కళను సాకారం చేసేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయి. గెలుస్తామన్న విశ్వాసంతో ముందుకు పోయాం. కానీ ఎలా గెలవాలన్న విషయంలో మాత్రం విఫలమయ్యాం. కమ్యూటర్ బైక్ ఉత్పత్తి లోకి వెళ్ళాల్సింది కాదు అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. బదులుగా ప్రీమియం బైక్స్ తయారు చేస్తే విజయం సాధించే వాళ్ళం అని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ నిర్హహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన మహీంద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జావా బైకులను మార్కెట్లోకి తేవడాన్ని సమర్థించుకున్నారు. అలాగే తమ గతంలో కొనుగోలు చేసిన బీఎస్ఏ బైక్ లను కూడా త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశ పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భారత్ లో ఆటోమొబైల్ మందగమనం త్వరలోనే ముగుస్తుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మంచి రోజులు మొదలవుతాయని చెప్పారు.