Anand Mahindra: ఆనంద్ మహీంద్రా ట్వీట్.. UPIపై ఆసక్తికర డేటా.. భారత్ నెం.1..!
Anand Mahindra: యూపీపై వ్యవస్థ భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. గతంలో కేవలం ఫిజికల్ మనీ వినియోగానికి అలవాటుపడిన ప్రజల్లో పెను మార్పు వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ చెల్లింపు వ్యవస్థల వివరాలతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ తెగ వైరల్ గా మారింది.
మహీంద్రా ట్వీట్..
దేశంలో అందరికీ అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపు మార్గాలపై పెద్ద చర్చ జరుగుతోంది. భారత్ సాధించిన విజయం "కేవలం అద్భుతమైనది" అంటూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పేర్కొన్నారు. వివిధ దేశాలలో ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపు వ్యవస్థలపై చార్ట్ను పంచుకున్నారు. భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రజలు UPI, Google Pay, Visa, RuPay, Phone Pe, Paytm లను భారీగా వినియోగిస్తున్నారు.

భారత్ క్రియేట్స్..
ప్రత్యేకమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో భారతదేశం సాధించిన విజయం కేవలం అద్భుతమైనదని మహీంద్రా వ్యాఖ్యానించారు. నాయకులు ఎల్లప్పుడూ కొత్త, భిన్నమైన మార్గాలను కనుగొంటారు, మిగిలిన ప్రపంచం వాటిని అనుసరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మహీంద్రా పంచుకున్న ట్వీట్ ఛార్ట్ పై కొంత మంది తప్పని అంటున్నారు.

ఇతర దేశాల్లో భారత UPI..
భారత్ రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మెుట్టమెుదటి సారిగా నేపాల్ తన దేశంలో వినియోగానికి అంగీకరించింది. ఆ తర్వాత భారత యూపీఐ వ్యవస్థను భూటాన్ వాడుకుంటోంది. ఈ క్రమంలో యూరప్ సైతం భారత యూపీఐ, రూపే చెల్లింపులను అంగీకరించటానికి ఒప్పుకుంది. ఫ్రాన్స్, UAE, సౌదీ అరేబియా, బహ్రెయిన్, సింగపూర్, మాల్దీవులు, భూటాన్, ఒమన్ సైతం భారతీయ చెల్లింపు వ్యవస్థలను స్వీకరించాయి. రానున్న కాలంలో మరిన్ని దేశాలు ఈ జాబితాలో చేరనున్నాయి.

చిన్న దేశాల కోరిక..
అనేక చిన్న దేశాలు ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసి విజయవంతంగా నడిపిస్తున్న యూపీఐ చెల్లింపుల వ్యవస్థను తమ దేశంలో వినియోగానికి కావాలని కోరుతున్నాయి. చిన్న మెుత్తంలో చెల్లింపులు చేసే వారికి ఈ వ్యవస్థ చాలా ఉపకరిస్తుందని ఆ దేశాలు భావిస్తున్నాయి. డిజిటల్ వైపు బాటలు వేయటానికి ఇలాంటి నూతన సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications