mahindra erupee: పండ్ల దుకాణంలో మహీంద్రా.. పేమెంట్ ఎలా చేశారో తెలుసా..?
mahindra erupee: ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే భారతీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. బిజినెస్ సమాచారంతో పాటు ఫన్నీ, టెక్నాలజీ, ఇతర విభాగాలకు చెందిన పలు ఆసక్తికర సంఘటనలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఎక్కువ అందుబాటులో ఉంటారు. 10.2 మిలియన్ల మంది ఈయనను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం తన మెదటి డిజిటల్ కరెన్సీ కొనుగోలు అనుభవాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
|
e-రూపాయి వాడానోచ్:
"ఆర్బీఐతో జరిగిన బోర్డు సమావేశంలో డిజిటల్ కరెన్సీ e-రూపీ గురించి తెలుసుకున్నాను. మీటింగ్ అనంతరం పండ్ల వ్యాపారి బచ్చే లాల్ సహాని దుకాణానికి వెళ్లాను. డిజిటల్ రూపాయితో చెల్లింపులు అంగీకరించే వారిలో తను ఒకరు. దానిమ్మ పండ్లు కొని, e-రూపీతో చెల్లించాను. డిజిటల్ ఇండియా కార్యరూపం దాల్చింది" అని మహీంద్రా ట్వీట్ చేశారు.
చట్టపరమైన కరెన్సీ:
డిసెంబర్ 1, 2022న రిటైల్ డిజిటల్ e-రూపీని పైలట్ ప్రాజెక్టుగా వాడుకలోకి తీసుకువస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇది చట్టపరమైన, డిజిటల్ టోకెన్ రూపంలోని టెండర్. నోట్లు, నాణేలను కేంద్ర బ్యాంకు విడుదల చేస్తున్న విధంగానే e-రూపాయినీ జారీ చేస్తోంది. స్మార్ట్ ఫోన్లలోని డిజిటల్ వాలెట్ ద్వారా ఈ లావాదేవీలను నిర్వహించే అవకాశం కల్పించారు.
బ్యాంకుల ద్వారానే..
కేవలం అధీకృత బ్యాంకులు అందించే వాలెట్ల ద్వారానే డిజిటల్ రూపాయి లావాదేవీలను జరపవచ్చు. రిటైల్ డిజిటల్ కరెన్సీని ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ పద్ధతిలో లావాదేవీలు వ్యక్తి -వ్యక్తి, వ్యక్తి-వ్యాపారికి మధ్య నిర్వహించబడతాయి. QR కోడ్లు ఉపయోగించి దుకాణాల్లో చెల్లింపులు చేయవచ్చు.