కరోనా-లాక్డౌన్పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భయానికి గురి చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి లాక్ డౌన్ గురించి స్పష్టతను ఇచ్చారు. జీవితాలను, జీవనోపాధిని కాపాడుతామని నిర్మలమ్మ తెలిపారు. దేశవ్యాప్తంగా రెండో దశ కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వివిధ వాణిజ్య సంఘాలు, ప్రముఖులతో మాట్లాడారు. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోందనే అంశంపై చర్చించారు. అలాగే, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సూచనలు తీసుకున్నారు.
కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిస్థాయిలో విశేషంగా కృషి చేస్తోందన్నారు నిర్మలమ్మ. రాష్ట్రాలతోను సమన్వయం చేసుకుంటూ ప్రజల జీవితాలను, అలాగే జీవనోపాధిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకర స్థాయిలో ఉంది. నేటి ఉదయం వరకు చూస్తే గత 24 గంటల వ్యవధిలో 13.56 లక్షల పరీక్షలు నిర్వహించగా, 2,73,810 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో వరుసగా అయిదో రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.