ఇండియన్స్ను ఆకట్టుకునేలా జెఫ్ బెజోస్, నగరాల్లో వ్యాపారుల నిరసన
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత్లో అడుగు పెట్టారు. ఆయన తన 3 రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు అధికారుల్ని కూడా కలవనున్నారు. పెట్టుబడులు, అమెజాన్ విస్తరణ, ఒప్పందాలు వంటి అంశాలు ఆయన పర్యటనలో ఉండనున్నాయి. పండుగ సమయంలో భారత్కు వచ్చిన జెఫ్ బెజోస్ ఇండియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
|
మహాత్ముడికి నివాళి
భారత్లో మంగళవారం అడుగు పెట్టగానే ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్కు వెళ్లి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించడమే కాదు.. ఆయన వేషధారణలో కూడా మార్పు చోటు చేసుకుంది. భారత సంప్రదాయ దుస్తులు ధరించి రెండు చేతులు జోడించి మహాత్ముడికి నమస్కరించారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు.
మహాత్ముడికి నివాళి.. అద్భుతంగా గడిచింది
ఇప్పుడే భారత్లో అడుగు పెట్టానని, ఈ మధ్యాహ్నం అద్భుతంగా గడిచిందని, ప్రపంచ గతినే మార్చిన ఓ మహాత్ముడికి నివాళులు అర్పించానని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. మీ జీవితంలో రేపే చివరి రోజు అన్నట్లుగా జీవించాలని, శాశ్వతంగా జీవిస్తారనుకొని నేర్చుకోవాలని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని కూడా పేర్కొన్నారు.
వ్యాపారుల నిరసన
ఇదిలా ఉండగా, జెఫ్ బెజోస్ రాక సందర్భంగా దేశంలోని వివిధ నగరాల్లో చిన్న వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అమెజాన్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్లు, ఆఫర్ల విషయంలో అనైతిక చర్యల ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సమయంలో బెజోస్ పర్యటన కొనసాగుతుండగా, వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు.
సంభవ్లో జెఫ్ బెజోస్
బుధవారం ఢిల్లీలో చిన్న, మధ్య తరహా ఆన్లైన్ వ్యాపారస్తుల సదస్సు సంభవ్లో ఆయన పాల్గొన్నారు. ఆన్లైన్ రిటైల్ ఉత్పత్తులు, సర్వీసులపై ప్రసంగంతో పాటు ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖులతో భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోను భేటీ కానున్నారు.