భారత్ అద్భుతం: కరోనా నుండి కోలుకోవడంపై ప్రపంచ బ్యాంకు
కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుండి మూడు నెలలకు పైగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దశలవారీగా లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ, కరోనా కేసులు, భయాల వల్ల వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు ప్రతికూలంగా నమోదయింది. మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం, రెండో త్రైమాసికంలో మైనస్ 7 శాతంగా నమోదయింది.
అయితే మూడో త్రైమాసికంలో కాస్త పాజిటివ్ కనిపించింది. నాలుగో త్రైమాసికం మరింత బాగుంటుందని ఆశాజనకంగా ఉన్నారు. కరోనా నుండి భారత్ వేగంగా కోలుకుంటోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా భారత్ ఇంత వేగంగా కోలుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 'అద్భుతం, భారత్ వేగంగా పుంజుకుంది' అని పేర్కొంది.
'సీనియర్ల'కు గుడ్న్యూస్, జూన్ 30 వరకు HDFC ప్రత్యేక డిపాజిట్ స్కీం
అద్భుతంగా బయటపడింది
కరోనా నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దోహదపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. కానీ ఈ పరిస్థితి నుండి భారత్ గోడకు కొట్టిన బంతిలా పైకి లేస్తోందని అంటున్నారు. ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సానుకూలంగా సవరిస్తున్నాయి. కరోనా సంక్షోభం నుండి భారత్ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అయితే ఇంకా పూర్తిగా బయటపడలేదని పేర్కొంది.
వచ్చే సంవత్సరం అంచనా
FY22లో జీడీపీ 7.5 శాతం నుండి 12.5 శాతం మధ్య ఉండవచ్చునని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వ్యాక్సినేషన్ వేగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, మరోసారి ఆంక్షల వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించనున్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్, ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్... ఇప్పుడు భారత్ ముందు ఉన్న అతి పెద్ద సవాళ్లు అని పేర్కొంది. అలాగే స్థూలంగా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ ఇంకా కొన్ని గణాంకాల్లో అస్థిరత నెలకొందని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగంలో ప్రధాన ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. ఇందుకు కారణంగా రెండేళ్లుగా ఎలాంటి వృద్ధి లేకపోవడమేనని అభిప్రాయపడ్డారు. దేశ తలసరి ఆదాయం పడిపోయిందన్నారు.
వృద్ధి... ఉపాధి
ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే కొద్దీ కరెంట్ ఖాతా లోటు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ద్రవ్య విధానంలో సరైన మార్పులు, అంతర్జాతీయంగా ద్రవ్యలభ్యత వంటి అంశాలు పెట్టుబడులకు మార్గం సుగమం చేయనున్నాయన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆర్థిక లోటు జీడీపీలో పది శాతం వరకు ఉంటుందని పేర్కొంది. వృద్ధి పుంజుకునే కొద్ది ఉపాధి పెరిగి, పేదరికం గాడిలోకి వస్తుందని వెల్లడించింది.