ఛార్జీలు పెంచుతాం: ఎయిర్టెల్, రూ.100 ఆదాయంలో రూ.35 పన్నులే
భారతీ ఎయిర్టెల్ టారిఫ్ పెంపుకు సిగ్గుపడటం లేదని ఆ సంస్థ అధినేత సునీల్ మిట్టల్ సోమవారం అన్నారు. అలాగే, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ షేర్ల విక్రయం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 5G లాంచింగ్కు ముందు ఎయిర్టెల్ అధినేత పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో పన్నులపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.100 ఆదాయం వస్తే రూ.35 ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగంపై ప్రభుత్వ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. స్థూల సర్దుబాటు ఆదాయం (AGR), స్పెక్ట్రం చెల్లింపులు టెలికం సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టివేశాయన్నారు. టెలికం రంగంపై ఉన్న భారం తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం పరిశ్రమ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. లేదంటే ఈ రంగంలో పెట్టుబడులు ఏ మాత్రం గిట్టుబాటు కావన్నారు. టెలికం టారిఫ్ లేదా ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి అన్నారు. ఇందుకు ఎయిర్టెల్ ఏమాత్రం వెనుకాడబోదన్నారు. దేశంలోని టెలికం కస్టమర్లు నెలకు సగటున 16GB డేటాను వినియోగిస్తున్నట్లు మిట్టల్ తెలిపారు. ఈ నేపథ్యంలో టారిఫ్ పెంపుకు ఇదే సమయమన్నారు. ప్రస్తుతం టెలికం టారిఫ్స్ కంపెనీలకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్నారు. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఒక్కో ఎయిర్టెల్ కస్టమర్ నుండి నెలవారీ ఆదాయం రూ.140గా ఉన్నదని, ఇది కనీసం రూ.300 ఉండాలన్నారు. మొత్తం టెలికం పరిశ్రమ ఆర్పు చూసినా రూ.200 మాత్రమే ఉందన్నారు. ఛార్జీల పెంపుతో మార్చి నాటికి రూ.200కు, ఆ తర్వాత రూ.300కు పెంచాలన్నారు.
దేశంలో 5G టెల్కో సర్వీసులు 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రారంభమవుతాయన్నారు. 5G స్పెక్ట్రం కోసం వేలం వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగవచ్చునన్నారు. ఈ ప్రకారం ద్వితీయార్థంలో సర్వీసులు ప్రారంభం కావొచ్చునని చెప్పారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్ల సమీకరించాలన్న కంపెనీ ప్రణాళిక కారణంగా 5G సర్వీసులకు భారీ పెట్టుబడులు చేయడానికి అవకాశం లభించిందన్నారు. 5G, ఫైబర్, డేటాసెంటర్ వ్యాపారాల్లోకి ఈ పెట్టుబడులను మళ్లిస్తామన్నారు.
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ.535 ధరతో రైట్స్ ఇష్యూ జారీ చేసి ఈ మొత్తం సమీకరించాలనే ప్రతిపాదనకు ఆదివారం భారతీ ఎయిర్టెల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న ప్రతి 1 ఈక్విటీ షేర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ రైట్స్ ప్రాతిపదికన వస్తుంది.