దేశంలో 5G నెట్వర్క్కు సంబంధించి టెలికం శాఖ 2021 జనవరి-మార్చి మధ్య వేలం నిర్వహించే అవకాశం ఉందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కానీ అధిక ధరలు ఉంటే మాత్రం తాము ఈ స్పెక్ట్రం వేలంలో పాల్గొనబోమని భారతీ ఎయిర్టెల్ తేల్చి చెప్పింది. రిజర్వ్ ధర ఎక్కువగా ఉంటే బిడ్డింగ్కు తాము దూరంగా ఉంటామని బుధవారం వెల్లడించింది. స్పెక్ట్రం వేలాన్ని వ్యూహాత్మకంగా పరిశీలిస్తున్నామని, 1,000 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీలకు దిగువన ఉన్న కొన్ని రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీల కోసం చూస్తున్నామని ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు.
ప్రస్తుతం స్పెక్ట్రం వేలానికి సంబంధించి కంపెనీ ఆలోచన చేస్తోందన్నారు. ముఖ్యంగా ఇంటి లోపల, గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు వెయ్యి మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ కొనుగోలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, 5జీకి రిజర్వ్ ధర ఎక్కువ ఉంటే మాత్రం బిడ్లో పాల్గొనమని చెప్పారు. తాము అంత ధర భరించలేమన్నారు. గతంలోను ఆయన ఇదే విషయం వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం 5G సేవలకు అనువైన 3,300-3,600 మెగాహెట్జ్ శ్రేణిలో స్పెక్ట్రం కోసం ఒక్కో మెగాహెట్జ్ ధరను రూ.492 కోట్లుగా ట్రాయ్ సిఫార్స్ చేసింది. ట్రాయ్ ప్రకారం 5జీ స్పెక్ట్రం కోసం కంపెనీ రూ.50వేల కోట్లు వెచ్చించవలసి వస్తుందని ఎయిర్టెల్ అంచనా. అంత మొత్తం తాము భరించలేమని తెలిపింది. 2జీ సేవల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన 1800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండును కొనుగోలు విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. 4జీ సేవలపై దృష్టి సారించేందుకు 2,300 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండుపై దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. రూ.2500 నుండి రూ.3వేల మధ్య జియో 5జీ స్మార్ట్ ఫోన్ అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications